చేర్యాలలో పల్లాకు నిరసన సెగ

చేర్యాలలో పల్లాకు నిరసన సెగ
  • చేర్యాలలో పల్లాకు నిరసన సెగ
  • రెవెన్యూ డివిజన్​ సంగతి ఏమైందంటూ నిలదీత 
  • గో బ్యాక్​ అంటూ ప్లకార్డులు ప్రదర్శించిన జేఏసీ
  • జేఏసీ లీడర్లతో బీఆర్ఎస్​ నేతల వాగ్వాదం 
  • వెనుదిరిగి వెళ్లిపోయిన ఎమ్మెల్సీ
  • నాలుగు మండలాల బంద్​ ప్రశాంతం

చేర్యాల, వెలుగు : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెవెన్యూ డివిజన్​ఏర్పాటు చేయాలనే డిమాండ్​తో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల సబ్​డివిజన్​లోని నాలుగు మండలాల్లో బంద్​నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పల్లాకు బీఆర్ఎస్​ జనగామ సీటు కన్ఫామ్​కావడంతో ఆయన కొమురవెల్లిలో పూజలు చేసి అక్కడి నుంచి జనగామ వరకు బైక్​ర్యాలీ తీశారు. అయితే, చేర్యాలకు చేరుకోగానే జేఏసీ నేతలు, ప్రజలు పల్లా గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. దీంతో నిరాహార దీక్షల దగ్గరకు వచ్చిన ఆయనను జేఏసీ నేతలు అడ్డుకున్నారు.

ఎన్నో ఏండ్లుగా రెవెన్యూ డివిజన్​కోసం పోరాడుతుంటే పట్టించుకోలేదని..ఇప్పుడు కోడ్​వచ్చాక రావడం ఏమిటని నిలదీశారు. ఏడేండ్లుగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నా ఒక్కసారి కూడా ఈ ప్రాంత సమస్యలపై గాని, జేఏసీ ఉద్యమం గురించిపై గాని ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్​టికెట్​వస్తదని, సీఎంను ఒప్పించి రెవెన్యూ డివిజన్​జీఓ తీసుకువస్తానని ఎన్నోసార్లు ప్రకటించి ఇప్పుడు ఉత్తచేతులతో ఎందుకు వచ్చావని అడిగారు. జిల్లాలో కలిపి చేర్యాలను ముక్కలు చెక్కలు చేశారని ఆరోపించారు. దీంతో వారిని పల్లా సముదాయించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయంలో బీఆర్ఎస్​, జేఏసీ లీడర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. చేసేదేమీలేక పల్లా వెళ్లిపోయారు.  

చేర్యాల బంద్​ సంపూర్ణం...

మరోవైపు చేర్యాలను డివిజన్​చేయాలంటూ నాలుగు మండలాల బంద్​కు పిలుపునివ్వగా సక్సెస్​అయ్యింది. హోటళ్లు, వర్తక వాణిజ్య సంస్థలు, వ్యాపార వర్గాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ బంద్​కు సహకరించారు. అన్ని మండలాల కూడళ్లలో ఉద్యమ జేఏసీ నేతలు ఆందోళన నిర్వహించారు.