శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో మృతులంతా కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అతివేగంతో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

శ్రీకాళహస్తి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వీరంతా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిలో రమేష్, నరసింహమూర్తి, రాజ్యలక్ష్మి,  శ్రీలత(38), అక్షయ (15), వెంకటరమణమ్మ గుర్తించారు.  గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి పేరు భరత్ (17).