మీర్పేట్, వెలుగు: అపార్ట్మెంట్లో కొత్త ఫ్లాట్ కొనేందుకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 8 మంది లిఫ్ట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు ఐదో అంతస్తులోని 501 నంబర్ ఫ్లాట్ను పరిశీలించి తిరిగి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు.
లిఫ్ట్ నాలుగో అంతస్తు వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ఆగిపోయింది. కొద్ది క్షణాల్లోనే నియంత్రణ తప్పి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో తిరునగరి నరసింహస్వామి, పద్మిని, వెంకటేశ్వర్లు, నిర్మల, గోపాలస్వామి, రేణుక, పద్మ, శోభ తీవ్రంగా గాయపడ్డారు. మీర్పేట్ ఇన్స్పెక్టర్ శోభన్ సంఘటన స్థలానికి చేరుకుని లిఫ్ట్ నిర్వహణలోపాలు, సాంకేతిక కారణాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
