- ఎగ్జామ్కు ముందురోజు ఘటన.. ముగ్గురి అరెస్ట్
పుణె/ థానె: మహారాష్ట్రలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)- ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో ఆదివారం జరగాల్సిన ఈ పరీక్ష 2026 వాయిదా పడింది. థానే జిల్లాలోని భివండీలో కొందరు వ్యక్తుల వద్ద టెట్ ప్రశ్నపత్రాలు ఉన్నాయంటూ శనివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంపై ఆకస్మిక దాడి జరిపి, ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులోని ప్రశ్నలు అసలు క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోయినట్లు గుర్తించారు. దీంతో భివండీ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే తమ ప్రాధాన్యత అని మహారాష్ట్ర రాష్ట్ర పరీక్షల మండలి (ఎంఎస్సీఈ) తెలిపింది.
పేపర్ లీక్పై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నందున ఈ నెల 28న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. నిందితుల వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలను నిపుణులు పరిశీలించగా, అసలు క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు థానే జిల్లా విద్యాధికారులు ధ్రువీకరించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 37 ప్రాంతాల్లోని 1,728 పరీక్షా కేంద్రాల్లో సుమారు 6 లక్షల మంది అభ్యర్థులు టెట్ పరీక్ష రాయాల్సి ఉంది.
పరీక్ష వాయిదా పడటంలో అభ్యర్థుల తప్పు ఏమీ లేనందున, మళ్లీ పరీక్ష నిర్వహణకు సంబంధించి వారి నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబోమని అధికారులు స్పష్టం చేశారు. కొత్త పరీక్ష తేదీలు, పూర్తి షెడ్యూల్ను త్వరలో కౌన్సిల్ అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తామని, అభ్యర్థులు ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఎగ్జామ్ కోసం ఇప్పటికే రిజస్టర్ చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదని తెలిపారు.
