నల్లబెల్లిలో భార్యను చంపి పరారైన భర్త

నల్లబెల్లిలో భార్యను చంపి పరారైన భర్త
  • వరంగల్  జిల్లా నల్లబెల్లి మండలంలో ఘటన

నల్లబెల్లి , వెలుగు : భార్యను చంపి భర్త పరారయ్యాడు. వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం రాంపూర్​లో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్​కు చెందిన పురం సారంగపాణి, అదే గ్రామానికి చెందిన మౌనిక (31) లవ్​  మ్యారేజ్  చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. సారంగపాణి రాంపూర్​కు సర్పంచ్​గా పనిచేశాడు.

కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంటి పోషణ భారం మౌనికపై పడింది. కూలినాలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఆమె పోషిస్తోంది. భార్యపై సారంగపాణి అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారం రోజుల పాటు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త వేధింపులపై సర్పంచ్​కు మౌనిక ఫిర్యాదు చేసింది. దీంతో నా పైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మద్యం మత్తులో అర్ధరాత్రి మౌనికను సారంగపాణి చిత్రహింసలకు గురిచేసి గొంతు పిసికి చంపాడు.

ఆమె చనిపోయిందని కన్​ఫం చేసుకున్నాక ఇంటి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పిల్లలు తమ తల్లి విగతజీవిగా కనిపించడంతో బోరుమన్నారు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి డెడ్​బాడీని మార్చురీకి తరలించారు.