పట్టపగలే యువతిపై కత్తితో దాడి

పట్టపగలే యువతిపై కత్తితో దాడి

షాద్ నగర్, వెలుగు: పట్టపగలే ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన షాద్ నగర్ పట్టణంలో శనివారం జరిగింది. సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. షాద్​నగర్ పట్టణానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ కాలేజీలో ఇంటర్​ఫస్ట్​ఇయర్​లో చేరింది. ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి పరిధిలోని పులిచర్లకుంట తండాకు చెందిన ఇస్లావత్ తిరుపతి(22) అదే కాలేజీలో సెకండ్​ఇయర్​చదువుతున్నాడు. 

అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు వెంటపడేవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా.. ఆ యువతి చదువు మధ్యలోనే ఆపేసి 2 నెలల నుంచి పట్టణంలోని ఓ దుకాణంలో పనిచేస్తోంది. దీంతో తిరుపతి తరచూ అక్కడికి వెళ్లి వేధిస్తుండేవాడు. శనివారం ఉదయం 11 గంటలకు బట్టలు ఆరేయడానికి బయటకు వచ్చిన యువతిపై తిరుపతి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. 

ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. కూతురు కేకలు విన్న తల్లి.. స్థానికుల సాయంతో షాద్ నర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. షాద్ నగర్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు.