- రిసెప్షనిస్ట్ జాబ్ ల పేరిట యువతులకు గాలం
- న్యూడ్ ఫొటోలు సేకరించి బ్లాక్ మెయిల్
- వందల్లో బాధితులు
- నిందితుడి అరెస్ట్
చందానగర్, వెలుగు : అతడి వృత్తి సాఫ్ట్వేర్ఉద్యోగం. ప్రవృత్తి జాబ్ల పేరిట యువతులకు ఎర వేయడం.. రిసెప్షనిస్ట్ ఉద్యోగాలిప్పిస్తానని మోసం చేసిన నిందితుడిని మియాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన క్లెమెంట్ రాజు(33) చెన్నైలో టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. క్విక్కర్. కామ్ ద్వారా రిసెప్షనిస్ట్ ఉద్యోగాల కోసం రిజిస్ర్టేషన్ చేసుకున్న యువతులు, మహిళల ఫోన్ నెంబర్లను స్వీకరిస్తాడు.
ప్రముఖ రాడిసన్ హోటల్లో రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇప్పిస్తాం అంటూ ఫోన్లో పరిచయం పెంచుకుంటాడు. ఉద్యోగం రావాలంటే మొత్తం నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేయాలని తెలియజేస్తాడు. తనకు న్యూడ్ ఫొటోలు పంపించాలని అదంతా ఇంటర్వ్యూలో భాగమేనని నమ్మబలుకుతాడు. పంపిన తరువాత వారిని బ్లాక్మెయిల్ చేస్తాడు. మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువతిని న్యూడ్ ఫోటోలు పంపించాలని రాజు కోరాడు. అనుమానం వచ్చిన సదరు యువతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ రఘురామ్ దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నిందితుడు రాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
16 రాష్ట్రాల్లో బాధితులు
రాజు వందలాది మంది యువతులను మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దాదాపు 16 రాష్ర్టాలకు చెందిన 800 నుండి 1000 మంది యువతులను జాబ్ల పేరిట న్యూడ్ ఫోటోలు సేకరించి వారిని బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు రాజు ఫోన్లో దొరికిన ఫొటోల ఆధారంగా పోలీసులు ధృవీకరించారు. తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారు సుమారు 60 నుండి 80 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అతని వద్ద నుండి మరిన్ని వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.