రెండేండ్లుగా బాత్రూంలోనే పిల్లలతో ఉంటున్న తల్లి

రెండేండ్లుగా బాత్రూంలోనే పిల్లలతో ఉంటున్న తల్లి

పెండ్లయిన కొన్నేళ్లకు భర్త చనిపోయాడు. ఉంటున్న పూరిల్లు కూడా కొద్ది నెలలకు కూలిపోయింది. ఎటు పోవాలో తెలియక పంచాయతీ కమిటీ హాలులో ఆ కుటుంబం తలదాచుకుంటే కొన్నాళ్లకు ఖాళీ చేయించారు. చివరికి తమ ఇంటి ముందున్న బాత్రూమ్​నే ఇల్లుగా చేసుకుందా  కుటుంబం. వండుడు, తినుడు, పండుకునుడు అంతా మరుగుదొడ్డి లోనే. వారం కాదు, నెల కాదు.. రెండేండ్లుగా అక్కడే ఉంటోంది. ఇద్దరు పిల్లలను రోజూ లోపల పడుకో బెట్టి అత్తాకోడలు బయట పడుకుంటున్నారు. అధికార పార్టీ లీడర్లు ఇల్లు ఇప్పిస్తామన్నారు గాని ఇంతవరకు పట్టించుకోలేదని మహబూబ్​నగర్​జిల్లా బాలానగర్​ మండలం తిరుమలగిరికి చెందిన ఆ మహిళలు చెబుతున్నారు. 

బాలానగర్, వెలుగు: పెండ్లయిన కొన్నేండ్లకే భర్త చనిపోవడం.. తర్వాత ఉన్న కొద్దిపాటి ఇల్లు కూలిపోవడంతో ఓ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇంటి ఆవరణలో ప్రభుత్వం కట్టించిన బాత్రూంలోనే రెండేళ్లుగా తలదాచుకుంటోంది. మహబూబ్​నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరికి చెందిన గుమ్మడి బాలయ్య, సుజాత(30) భార్యాభర్తలు. వీరికి భాను(10), విన్నీ(7) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడేండ్ల క్రితం బాలయ్య అనారోగ్యంతో చనిపోగా అప్పటి నుంచి అత్త అంజమ్మ, ఇద్దరు పిల్లలతో సుజాత పూరింట్లోనే ఉండేది. ఇద్దరూ కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. బాలయ్య చనిపోయిన కొన్ని నెలలకే ఇల్లు కూలిపోయింది. దాంతో ఎటు వెళ్లాలో తెలియక ఆ పేద కుటుంబం గ్రామ పంచాయతీకి చెందిన కమిటీ హాలులో తలదాచుకుంది. కొన్నాళ్లకు పంచాయతీకి చెందిన సామగ్రి పెట్టాలని గ్రామ పెద్దలు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. చేసేదేమీ లేక ఇంటి స్థలం గతంలో ప్రభుత్వం కట్టించిన మరుగుదొడ్డిని సుజాత, అంజమ్మ ఇంటిగా మార్చుకున్నారు. రెండేండ్లుగా అందులోనే ఉంటున్నారు. వండుకునేది, తినేది అన్నీ బాత్రూంలోనే. ఎండైనా, వానైనా ఇద్దరు పిల్లలను బాత్రూంలో పడుకోబెట్టి మహిళలిద్దరూ బయట పడుకుంటున్నారు. స్థానిక అధికార పార్టీ లీడర్లు ఇల్లు ఇప్పిస్తామని చెబుతున్నారే తప్ప ఇంతవరకు పట్టించుకోలేదని సుజాత, అంజమ్మ వాపోతున్నారు.