హైదరాబాద్: పాతబస్తీలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమేనీ మృతికి సంతాపంగా వందలాది మంది రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇరాన్పై దాడిని అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఖమేనీని హత్య చేయడం అమానుషం అని ఆయన చెప్పారు. ఇది అంతర్జాతీయ చట్టాలపై ఉల్లంఘనే అని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు యుద్ధం ఆపేసి శాంతి చర్చలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
భారత్ కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఒవైసీ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ కూడా హింసాత్మక చర్యలను ఖండించాలని, దాడిలో స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కొనసాగితే చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని.. సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని -ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ మిసైల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి దాడిలోనే టెహ్రాన్లోని తన కార్యాలయంలో 86 ఏళ్ల ఖమేనీ చనిపోయారు. ఖమేనీ మరణ వార్తను ముందుగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
చరిత్రలోనే అత్యంత దుర్మార్గపు వ్యక్తులలో ఒకరు మరణించారని, ఇరాన్ ప్రజలు దేశాన్ని చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ‘ఐఆర్ఐబీ’ కూడా ఖమేనీ మృతిని ధ్రువీకరించింది. "ఇరాన్ సుప్రీం లీడర్ అమరత్వం పొందారు" అని ఆదివారం ఉదయం ప్రకటించింది.
