స్టార్ క్రికెటర్ భార్యకు ఆకతాయిల వేధింపులు

స్టార్ క్రికెటర్ భార్యకు ఆకతాయిల వేధింపులు

ఢిల్లీలో ఓ స్టార్ క్రికెటర్ భార్యను ఇద్దరు ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు. బైక్ పై కారును వెంబడిస్తూ.. పిచ్చి పిచ్చి మాట్లాడుతూ.. ఇబ్బందులకు గురి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

అసలేం జరిగింది..? 

బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్ కతా నైట్ రైడర్స్, స్టార్ క్రికెటర్ నితీష్ రాణా భార్య  సాచి మర్వా.. మే 4వ తేదీన రాత్రి కారులో ఇంటికి బయలుదేరుతుండగా ఢిల్లీలోని కీర్తినగర్ ప్రాంతంలో ఇద్దరు యువకులు బైక్ పై ఆమెను వెండించారు. బైక్ తో కారును అడ్డుకోవడానికి పదేపదే ప్రయత్నించారు. ఒక దశలో బైక్ తో కారును కూడా ఢీకొట్టారు. గట్టిగా అరుస్తూ సాచి మర్వాను ఇబ్బంది పెట్టారు. సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పాటు వారు సాచి మార్వా కారును వెంబడించారు. 

తనకు ఎదురైన అనుభవాన్ని సాచి మర్వా ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇద్దరి ఫొటోలను షేర్ చేశారు. ఆకతాయిలు తన కారును వెంబడించి.. వేధింపులకు గురి చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోసారి అలాంటి సందర్భం ఎదురైతే వెహికల్ నెంబర్ ను నోట్ చేసుకోవాలని వారు ఉచిత సలహా ఇచ్చారని చెప్పారు. ఢిల్లీ పోలీసుల నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. 

అయితే.. ఇదే కేసులో పోలీసులు ఇద్దరిలో ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సామాన్యులకే కాదు.. సెలబ్రేటిలకు కూడా ఢిల్లీలో రాత్రి సమయాల్లో రక్షణ లేకుండా పోయిందని కామెంట్స్ చేస్తున్నారు. 

నితీష్ రాణా భార్య పేరు సాచి మర్వా..ఇంటీరియర్ డిజైనర్. 2019 ఫిబ్రవరి 19న నితీష్ రాణాను పెళ్లి చేసుకున్నారు.