న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటన కోసం ప్రకటించిన ఇండియా టీమ్లో ఒక్క మార్పు చోటు చేసుకుంది. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీకి తొలిసారి జట్టులో చోటు కల్పించారు. దాంతో కశ్మీర్ లోయ నుంచి టీమిండియాకు ఎంపికైన తొలి ప్లేయర్గా నబీ చరిత్ర సృష్టించాడు. బారాముల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన 29 ఏళ్ల నబీ.. పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత జమ్మూ కశ్మీర్ నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన మూడో క్రికెటర్.
రసూల్, మాలిక్ ఇండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడగా, నబీ నేరుగా టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో నబీ 104 వికెట్లు పడగొట్టాడు. 2025–26 సీజన్లో ఏకంగా 60 వికెట్లు తీసి జమ్మూ కశ్మీర్చారిత్రక రంజీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్లోనూ రాణించే సత్తా ఉన్న నబీ.. శ్రీలంకలో ఇటీవల ఇండియా–ఎ టూర్లో 6 వికెట్లు తీశాడు. పాదం గాయంతో బాధపడుతున్న సాయి సుదర్శన్ ఫిటినెస్ సాధిస్తే తుది జట్టులో ఆడే చాన్స్ ఉంది. లంకతో రెండు టెస్ట్ల సిరీస్ ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతుంది.
టెస్టు జట్టు: శుభ్మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్, అకిబ్ నబీ.
==================================
