హైదరాబాద్: జన్వాడ ఫాం హౌస్ భూములపై జరుగుతున్న ప్రచారం, రాజకీయ పార్టీల నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో.. ఫాం హౌస్ యజమాని ప్రదీప్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ప్రదీప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జన్వాడ ఫాం హౌస్ ఉన్న భూమి తన సొంతమని, ఈ ఫాం హౌస్ భూమికి, కేటీఆర్కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.
కేటీఆర్, తాను చిన్నప్పటి నుంచి స్నేహితులమని చెప్పారు. తన సొంత ప్రాపర్టీ అయిన జన్వాడ ఫాం హౌస్ను కేటీఆర్కు లీజ్కు ఇచ్చానని, ప్రస్తుతం ఈ ఫాం హౌస్ను పరిశీలించేందుకు రాజకీయ పార్టీల నేతలు వస్తారన్న ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు.
ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు ఏమైనా అనుమానాలు ఉంటే, తనకు నోటీసులు జారీ చేసి వివరణ కోరవచ్చని ప్రదీప్ రెడ్డి పేర్కొన్నారు. ఫాం హౌస్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని, ఈ భూములకు లీగల్గా క్లియర్ టైటిల్ ఉందని తెలిపారు.
ప్రభుత్వ అధికారులు ఏవైనా వివరాలు లేదా పత్రాలు కోరితే, చట్టపరమైన విధానంలో వాటిని సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే రాజకీయ పార్టీల నేతలు వచ్చి వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ రాజకీయ వివాదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. చట్టపరమైన ప్రక్రియకు తాను పూర్తిగా సహకరిస్తానని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు.
