మెడికల్ షాపులపై CCTV నిఘా.. కొత్త రూల్ తీసుకొస్తున్న మోడీ సర్కార్!

మెడికల్ షాపులపై CCTV నిఘా.. కొత్త రూల్ తీసుకొస్తున్న మోడీ సర్కార్!

మెడికల్ షాప్స్‌లో అనధికారికంగా ప్రిస్క్రిప్షన్ మందుల అమ్మకాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ H, H1, X రకానికి చెందిన కీలకమైన మందుల అమ్మకాల పారదర్శకతను పెంచేందుకు మెడికల్ స్టోర్లలో CCTV నిఘాను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ సిఫార్సుల మేరకు ఈ కొత్త రూల్ అమలులోకి తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలకు వాడే ఈ ప్రత్యేక మందులు చాలావరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్మాలి. కానీ ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఈ మందులను ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి అనధికారిక సేల్స్ అడ్డుకోవడానికి, పారదర్శకతను పెంచడానికి సీసీటీవీ సర్వేలెన్స్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఏ మందు ఎవరికి విక్రయిస్తున్నారనే దానిపై కచ్చితమైన నిఘా ఉంచడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ ఈ నిర్ణయంపై ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ & డ్రగ్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చిన్న, మధ్యతరహా కెమిస్టులపై ఇది తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు జె.ఎస్. షిండే, ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింఘాల్ పేర్కొన్నారు. దుకాణాల్లో 6 నుంచి 8 సీసీటీవీ కెమెరాలు, డీవీఆర్, స్టోరేజ్, వైరింగ్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, నిర్వహణ ఖర్చులకు సుమారు రూ.50వేల నుండి రూ.లక్ష కంటే ఎక్కువ ఖర్చు అవుతుందంటున్నారు.

►ALSO READ | ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్: స్టిక్కర్ మార్చకుండానే బ్యాంక్ పోర్ట్ చేసుకోవచ్చు

ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ఫార్మసీలకు ఈ రూల్ పాటించడం చాలా కష్టమని AIOCD తెలిపింది. పదే పదే కరెంట్ కోతలు, సరిగా లేని ఇంటర్నెట్ సౌకర్యం, శిక్షణ పొందిన టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల నిరంతరం సీసీటీవీ రికార్డింగ్ సాధ్యం కాదని తమ ఇబ్బందులను చెబుతున్నారు. ప్రజా భద్రత కోసమే సీసీటీవీలు తప్పనిసరి అనుకుంటే.. ఆ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వమే సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి బదులు అమలు చేసేందుకు వీలుంటే మార్గాలను అన్వేషించాలను కోరుతున్నారు.