
హైదరాబాద్ ఎల్బీనగర్ లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఎల్బీనగర్ సాగర్ రింగు రోడ్డు వద్ద 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడి దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఓ వీధి కుక్క కూడా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
సాగర్ రింగు రోడ్డు వద్ద ఒక్కసారిగా 11కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఓ ఆలయం వద్ద పడుకొని ఉన్న ఇద్దరు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో వారికి కొద్ది దూరం లో ఓ వీధి కుక్క కూడా విద్యుదాఘాతంతో మృతి చెందింది. హై ఓల్టేజ్ తీగల కారణంగా దంపతులతో పాటు, వీధి కుక్క కూడా నల్లగా మాడిపోయాయి.
తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేసి, ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మూసివేశారు.
మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై విద్యుత్ అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యుత్ లైన్ల నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.