నేను నా భర్త, పిల్లలను వదిలి.. ప్రియుడితోనే ఉంటా

నేను నా భర్త, పిల్లలను వదిలి.. ప్రియుడితోనే ఉంటా


ఆత్మకూర్​, వెలుగు: ఒకే కాలనీలో ఉండడం ద్వారా ఏర్పడిన పరిచయం వారిద్దరినీ ప్రేమికులుగా మార్చింది. అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సదరు మహిళ, పెళ్లికాని యువకుడితో కాపురం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఇద్దరూ కలిసి వనపర్తి జిల్లా అమరచింత నుంచి వరంగల్ ​వెళ్లి నెల రోజులుగా కలిసి ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సుజాతకు భర్త, పదేళ్ల వయసున్న కొడుకు, ఏడేళ్ల కూతురు ఉన్నారు. అయితే అదే కాలనీకి చెందిన రాకేశ్​అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా  ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడి మోజులో భర్త, పిల్లల్ని వదిలి నెల రోజుల కింద రాకేశ్​తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్యాభర్తలమని చెప్పి   ఇద్దరూ వరంగల్​లో ఇల్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వాళ్లిద్దరి కోసం ఇరు కుంటుంబాలు తీవ్రంగా గాలించాయి. చివరికి వరంగల్ లో ఉంటున్నట్లు తెలిసింది.  ఈనెల 21న రాకేశ్​ కుటుంబ సభ్యులు వరంగల్​ వెళ్లారు. ఇద్దరిని ఒప్పించి అమరచింతకు తీసుకువచ్చారు. భర్త ఇంటి వద్ద సుజాతను వదిలి పెట్టారు. 

మాకు పెండ్లయ్యింది..

కాగా సుజాత సోమవారం అమరచింత పోలీస్​స్టేషన్​కు వచ్చింది. తాను రాకేశ్​తోనే ఉంటానని స్టేషన్​ ముందు బైఠాయించింది. వరంగల్​ వెయ్యి  స్తంభాల గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పింది.  రాకేశ్​​పై, తనపై  వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని,  రాకేశ్​ను ఎక్కడో దాచి పెట్టారో చెప్పాలని కోరింది. అతని మొబైల్ ​అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించింది. అనంతరం సుజాత ఫిర్యాదు మేరకు కేసు ఫైల్​ చేసినట్లు ఎస్సై  ప్రవీణ్ తెలిపారు.