ఆత్మకూర్, వెలుగు: ఒకే కాలనీలో ఉండడం ద్వారా ఏర్పడిన పరిచయం వారిద్దరినీ ప్రేమికులుగా మార్చింది. అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న సదరు మహిళ, పెళ్లికాని యువకుడితో కాపురం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో ఇద్దరూ కలిసి వనపర్తి జిల్లా అమరచింత నుంచి వరంగల్ వెళ్లి నెల రోజులుగా కలిసి ఉంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సుజాతకు భర్త, పదేళ్ల వయసున్న కొడుకు, ఏడేళ్ల కూతురు ఉన్నారు. అయితే అదే కాలనీకి చెందిన రాకేశ్అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ప్రియుడి మోజులో భర్త, పిల్లల్ని వదిలి నెల రోజుల కింద రాకేశ్తో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్యాభర్తలమని చెప్పి ఇద్దరూ వరంగల్లో ఇల్లు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. వాళ్లిద్దరి కోసం ఇరు కుంటుంబాలు తీవ్రంగా గాలించాయి. చివరికి వరంగల్ లో ఉంటున్నట్లు తెలిసింది. ఈనెల 21న రాకేశ్ కుటుంబ సభ్యులు వరంగల్ వెళ్లారు. ఇద్దరిని ఒప్పించి అమరచింతకు తీసుకువచ్చారు. భర్త ఇంటి వద్ద సుజాతను వదిలి పెట్టారు.
మాకు పెండ్లయ్యింది..
కాగా సుజాత సోమవారం అమరచింత పోలీస్స్టేషన్కు వచ్చింది. తాను రాకేశ్తోనే ఉంటానని స్టేషన్ ముందు బైఠాయించింది. వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపింది. ఎన్ని సమస్యలు ఎదురైనా ఇద్దరం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. రాకేశ్పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని, రాకేశ్ను ఎక్కడో దాచి పెట్టారో చెప్పాలని కోరింది. అతని మొబైల్ అందుబాటులో లేకుండా చేశారని ఆరోపించింది. అనంతరం సుజాత ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.