ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందని యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందని యువకుడి ఆత్మహత్య

 మానకొండూర్, వెలుగు: తాను ఇష్టపడిన యువతికి  వేరే అబ్బాయితో పెండ్లవుతోందని  తెలిసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన ఎలుబాక శ్రీనివాస్​కు ఇద్దరు కొడుకులు. ఇద్దరికీ పెండ్లిళ్లు కాలేదు. రెండో కొడుకు కార్తీక్(26) బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెండ్లి కూడా  చేసుకుంటానని కొద్దికాలంగా తల్లిదండ్రులకు చెప్తూ వస్తున్నాడు. 

ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫు వారు కార్తీక్ తండ్రి శ్రీనివాస్‌ను పెండ్లి గురించి సంప్రదించారు. అయితే, పెద్ద కొడుకు శివప్రసాద్‌కు పెండ్లి చేశాకే కార్తీక్‌కు వివాహం చేస్తానని స్పష్టం చేశాడు. అలా అయితే, ఆలస్యమవుతుందని, అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో పెండ్లి నిశ్చయించారు. ఇది తెలుసుకున్న కార్తీక్‌ శుక్రవారం రాత్రి మానకొండూరు శివారు సదాశివపల్లిలోని ఓ మామిడి తోటలో పురుగు మందు తాగి, అతడి అన్నకు ఫోన్​ చేశాడు. 

అక్కడికి చేరుకున్న శివప్రసాద్‌ 108 వాహనంలో కరీంనగర్‌‌లోని ఓ ప్రైవేట్​ దవాఖానకు తరలించాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. తండ్రి శ్రీనివాస్‌  ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూరు సీఐ రాజకుమార్ తెలిపారు.