జూమ్ లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

జూమ్ లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: సీఎల్పీ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో  సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం, సీతారామ సాగర్ ప్రాజెక్టులతో పాటు ఇతర ముంపు ప్రాంతాల్లో నష్టపోయిన రైతుల గురించి చర్చించారు. రైతులకు నష్ట పరిహారం అందించాలని జూమ్ వేదికగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని సీఎల్పీలో నిర్ణయించినట్లు కాంగ్రెస్ తెలిపింది. అదే విధంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందజేయగా... స్పీకర్ వెంటనే ఆమోదించారు. ఈ క్రమంలో సీఎల్పీ మీటింగ్ లో రాజగోపాల్ రెడ్డి అంశం గురించి కూడా చర్చించినట్లు తెలుస్తోంది.