- అనుమానాలుంటే టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: క్యూర్ పరిధిలో ప్రభుత్వం చేపడ్తున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని, తప్పుడు ప్రచారాలను, దళారులను నమ్మవద్దని లబ్ధిదారులకు హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఎల్ఐజీ టవర్స్ స్కీమ్లో ప్రజలకు అనుమానాలుంటే నేరుగా తమ సిబ్బందికి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు.
ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని నాంపల్లి హౌసింగ్ బోర్డు కార్యాలయంలో కాల్ సెంటర్, హెల్ప్ లైన్ నంబర్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ స్కీమ్కు అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు.. ఇలా పూర్తి సమాచారం అందించేందుకు హెల్ప్లైన్ ప్రారంభించామన్నారు. ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా 040 –-24603572 నంబర్కు ఉదయం 9 గంటల నుంచి సాయింత్రం 6 గంటల మధ్య ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో సమాధానాలు ఇస్తామని చెప్పారు.
తొలి విడత 7,680 ఇండ్లు..
క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, తొలివిడత16 నియోజకవర్గాల్లో 7,680 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి తెలిపారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ పోర్టల్, వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ నంబర్ తెలియజేస్తే సరిపోతుందన్నారు.
కుల, జీత భత్యాల ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని, లాటరీ సమయంలో వీటిని సమర్పించవచ్చని వెల్లడించారు. దరఖాస్తు సమయంలో రూ.10 వేల చెల్లింపునకు యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ను మాత్రమే ఉపయోగించాలని, ఒక వేళ ఇల్లు మంజూరు కాకపోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాపస్ చేస్తామని స్పష్టం చేశారు. పరిశీలన, కేటాయింపు, వాపసు తదితర సమాచారం పూర్తయ్యే వరకు మీసేవ రశీదు, చెల్లింపు రశీదు, దరఖాస్తు సంఖ్య, మొబైల్ నంబర్లను యాక్టివ్గా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్, హౌసింగ్ బోర్డు సీఈ రమణారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
