ఢిల్లీ జనం ఆప్ వైపేనా? ‘చీపురు’ ఊడ్చేస్తుందంటున్న ఎగ్జిట్పోల్స్
మెజారిటీ కొంచెం తగ్గుతుందంతే.. బీజేపీకి సెకండ్ ప్లేస్
దేశ రాజధానిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
రెండో స్థానంలో బీజేపీ..68 శాతం పోలింగ్ నమోదు
చివరలో పుంజుకున్న ఓటింగ్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగాయి. మొత్తంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎలక్షన్లలో కూడా ‘ఆప్’స్పష్టమైన మెజారిటీతో సర్కారు ఏర్పాటు చేయబోతున్నదని ఎగ్జిట్పోల్స్సర్వేల్లో వెల్లడైంది. టైమ్స్నౌ, ఇండియా టుడే, ఎన్డీ టీవీ , ఏబీపీ, రిపబ్లిక్, న్యూస్ ఎక్స్ వంటి చానల్స్చేసిన సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ యావరేజ్గా 40 నుంచి 63 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటరు చీపురుకే జైకొట్టాడని, 50కి పైగా నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరనుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించాయి. సీఎంగా కేజ్రీవాల్కు ఢిల్లీ ఓటర్లు మరోమారు అవకాశమిచ్చారని చెప్పాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్పోల్స్ లో కాస్త అటూఇటూగా ఇవే ఫలితాలు వెలువరించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకుని తిరిగి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పాయి. ఆప్ తర్వాతి స్థానంలో బీజేపీ నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ చతికిలపడిందని తెలిపాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 54 నుంచి 59 సీట్లు, బీజేపీ 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్ 0 నుంచి 2 సీట్లు గెలుచుకుంటాయని పీపుల్స్ పల్స్ ప్రెడిక్షన్ సర్వే సంస్థ అంచనా వేసింది. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని తెలిపింది. సంక్షేమ పథకాలే ఆప్ సర్కారుకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టనున్నాయని చెప్పింది. టైమ్స్ నౌ, న్యూస్ ఎక్స్ నేతా, రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, జన్కీ బాత్, ఇండియా న్యూస్ నేషన్ తదితర సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించబోతోందని వెల్లడించాయి.
68 శాతం పోలింగ్ నమోదు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు శనివారం జరిగిన పోలింగ్లో రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తమ్మీద ఈ ఎన్నికల్లో పోలింగ్ 68 శాతంగా నమోదైంది. ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైనా టైం గడిచే కొద్దీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. పొద్దున 8 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. మూడు గంటల తర్వాత పోలింగ్ శాతం కేవలం 14.5 మాత్రమే. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ పర్సంటేజ్41.5 శాతానికి పెరిగింది. సాయంత్రానికి పోలింగ్ నెమ్మదిగా పుంజుకుంది. కేంద్ర మంత్రులు, పలు పార్టీల సీనియర్ లీడర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఓటేసేందుకు క్యూ కట్టారు. ఢిల్లీ వాసులందరూ ఓటేయాలంటూ వారు పిలుపునిచ్చారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, అర్ఎస్ఎస్ సీనియర్ లీడర్రామ్లాల్ ఓటేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులతో పాటు సీఎం అరవింద్కేజ్రీవాల్కుటుంబంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, లెఫ్టినెంట్ గవర్నర్అనిల్ బైజల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఎంపీ పర్వేశ్ వర్మ, బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి తదితర ప్రముఖులు ఓటేశారు. ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్, కేజ్రీవాల్ కొడుకు పుల్కిత్లు మొదటిసారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీవీప్యాట్ స్లిప్పుల్లో కొన్నిచోట్ల క్యాండిడేట్ల పేరు, ఫొటో మిస్సయ్యాయంటూ కంప్లైంట్లు వచ్చాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రోమేశ్ సభర్వాల్ పేరు ఇలాగే మిస్సయింది. దీనిపై ఆయన ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ మెషీన్ను మార్చేశారు. ఈశాన్య ఢిల్లీలోని బాబర్పూర్ ప్రైమరీ స్కూల్పోలింగ్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆఫీసర్ ఊధం సింగ్ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే
చనిపోయారు.
మైనారీటీ ఏరియాల్లో ఓటర్ల రద్దీ
మిగతా కేంద్రాలకు భిన్నంగా మైనారిటీలు ఎక్కువగా ఉన్న షాహీన్ బాగ్, జఫ్రాబాద్, శీలంపూర్, జామియా నగర్ తదితర ఏరియాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఓటేసేందుకు జనం బారులు తీరారు. రాజధానిలో యాంటీ సీఏఏ ఆందోళనల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద సెక్యూరిటీని పటిష్టం చేశారు. సెన్సిటివ్ జోన్లలో సెక్యూరిటీ సిబ్బంది కవాతు నిర్వహించారు. షాహీన్ బాగ్ ఆందోళనకారులను ప్రత్యేకంగా కలుసుకున్న ఎన్నికల అధికారులు.. ఈ ఎన్నికల్లో ఓటేయాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలని కోరారు. షాహీన్బాగ్లోని 5 కేంద్రాలను సెన్సిటివ్ జోన్లో చేర్చి, తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు
ఊపిరిపీల్చుకున్నారు.
ప్రముఖులు ఎక్కడ ఓటేశారు?
కేజ్రీవాల్ – సివిల్ లైన్స్
హమీద్ అన్సారీ (మాజీ ఉప రాష్ట్రపతి) – నిర్మాణ్ భవన్
జైశంకర్( ఫారెన్ మినిస్టర్) – తుగ్లక్రోడ్డులోని ఎన్ఎండీసీ స్కూలు
కేంద్రమంత్రి హర్షవర్థన్ – కృష్ణానగర్ రతన్దేవి పబ్లిక్ స్కూల్
అనిల్బైజల్( ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్) –గ్రేటర్ కైలాష్
70 అసెంబ్లీ సీట్లకుగాను 672 మంది కేండిడేట్లు పోటీపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో కోటీ 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికార ఆమ్ ఆద్మీపార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఈసారి కూడా ఇంతకుముందు మాదిరిగా కాంగ్రెస్ మూడో ప్లేస్కే పరిమితం అవుతుందని పొలిటికల్ ఎనలిస్ట్లు అంచనావేస్తున్నారు.
ఈ రోజు ఢిల్లీ పోలింగ్ డే. డెమొక్రసీ అనే పండగలో ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని, ఓటింగ్ లోకొత్త రికార్డ్ను సృష్టించాలని ఓటర్లను కోరుతున్నా. – ప్రధాని నరేంద్ర మోడీ
అబద్ధాలు చెప్పేవాళ్ల నుంచి, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చేసేవాళ్ల నుంచి దేశరాజధానికి “స్వేచ్ఛ”కల్పించాలని ఢిల్లీ ఓటర్లను కోరుతున్నా. – కేంద్ర హోంమంత్రి అమిత్ షా
దేశం కలిసికట్టుగా ఉండాలంటే, ఢిల్లీ అభివృద్ధి సాధించాలంటే మీరు వేసే ప్రతి ఒక్క ఓటూ ముఖ్యమే. ఢిల్లీ బంగారు భవిష్యత్తును మీ ఓటుతో నిర్ణయిస్తారు. – బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా