ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఎలక్షన్ కమీషన్ డేటా ప్రకారం మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటేసింది. దీంతో మేయర్ పీఠం ఆప్ వశమైంది. ఇక బీజేపీ ఇప్పటివరకు 97 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ ఏడు సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. ఢిల్లీలో 15 ఏళ్లుగా బీజేపీ అధికారం చేపడుతూ వస్తోంది. ఇప్పుడు బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలుకొట్టింది. ఢిల్లీలోని 250 వార్డులకు డిసెంబర్ 4న జరిగిన పోలింగ్లో దాదాపు 50 శాతం ఓటింగ్ నమోదు కాగా, మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
1958లో ఏర్పాటైన ఎంసీడీ (MCD)ని 2012లో అప్పటి సీఎం షీలా దీక్షిత్ హయాంలో మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. ఎంసీడీగా పునరుద్ధరించిన తరువాత ఇదే మొదటి ఎన్నికలు కావడం గమనార్హం.