ఢిల్లీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ మేయర్గా తిరిగి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికకు తగినంత బలం లేకపోవడంతో బీజేపీ వెనక్కి తగ్గింది. ఇక డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా అలాగే జరగడం విశేషం.
ఆప్ అభ్యర్థి ఆలీ మహమ్మద్ ఇక్బాల్ డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంసీడీ ప్రధాన కార్యాలంలో పోలింగ్ జరిగింది. ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్, మహమ్మద్ ఇక్బాల్ లకు సీఎం అరవింద్ కేజ్రివాల్ కంగ్రాట్స్ చెప్పారు. ప్రజలకు ఆప్పై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వారి అంచనాలను నెరవేర్చేందుకు కష్టపడి పనిచేద్దామంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఢిల్లీ మేయర్ ఎన్నిక రొటేషనల్ పద్ధతిలో ఐదు సింగిల్ ఇయర్స్ టర్మ్తో ఉంటుంది. తొలి సంవత్సరం మహిళలకు రిజర్వ్ చేయగా, రెండో సంవత్సరం ఓపెన్ కేటగిరిగా, మూడు సంవత్సరం రిజర్వ్డ్ కేటగిరిగా, తక్కిన రెండేళ్లు ఓపెన్ కేటగిరిగా ఉంది.
ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత సిటీకి కొత్త మేయర్ వస్తారు. డిసెంబర్ 4న ఎంసీడీ ఎన్నికలు జరగగా, ఆప్ అత్యధిక సీట్లు దక్కించుకుంది. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జెండా ఎగురవేశారు. దాదాపుగా 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని సొంతం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది.