తెలంగాణలో RTA చెక్ పోస్టుల రద్దు చాలా పెద్ద నిర్ణయం: మంత్రి పొన్నం

తెలంగాణలో RTA చెక్ పోస్టుల రద్దు చాలా పెద్ద నిర్ణయం: మంత్రి పొన్నం

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌ చెక్‌పోస్టులను తక్షణమే మూసివేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీఏ చెక్ పోస్టుల రద్దు చాలా పెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. చెక్ పోస్టుల విషయంలో మరింత పారదర్శకత తీసుకొస్తామని.. ఇందులో భాగంగానే ప్రస్తుతమున్న ఆర్టీఏ చెక్ పోస్టులను రద్దు చేసినట్లు తెలిపారు. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో సిమ్యులేటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రవాణా వ్యవస్థలో ఏఐ సేవలు మరింత వినియోగిస్తామని స్పష్టం చేశారు. 

బుధవారం (అక్టోబర్ 22) రవాణా శాఖపై సంబంధిత అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఏ విధంగా ఉందో అందరం చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి హైదరాబాద్‎కు రావొద్దని అన్నారు.  ప్రజలు సహకరిస్తేనే ట్రాఫిక్ కష్టాలు, కాలుష్యం తగ్గుతుందన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థులు, ప్రజలు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామని.. రూల్స్ అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు ఇస్తున్నామని.. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వాహనాల స్క్రాపింగ్ విషయంలో కొత్త పాలసీ తీసుకొస్తున్నామని చెప్పారు. వాహనాల స్క్రాపింగ్‎ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు యోచిస్తున్నామన్నారు.