
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మధురానగర్లోని దివ్యశక్తి అపార్ట్మెంట్లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. రెండో ఫ్లోర్లోని ఫ్లాట్ నంబర్201లో కిశోర్ అనే వ్యక్తి డబ్బింగ్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. చార్మినార్గుల్జార్హౌస్ సమీపంలో జరిగిన మాదిరే ఇక్కడ కూడా ఏసీ కంప్రెషర్ నుంచి పొగలు వ్యాపించి మంటలు అంటుకున్నాయి. దీంతో స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బందితోపాటు మిగిలిన ఫ్లాట్లలోని జనం పరుగులు తీశారు. సమాచారం అందుకున్న హైడ్రా, ఫిలింనగర్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
డబ్బింగ్ థియేటర్ ఓనర్ కిషోర్ బయటకు రాగా.. స్టూడియోలో చిక్కుకున్న రాజేశ్ను డీఆర్ఎఫ్ సిబ్బంది ల్యాడర్ సాయంతో బయటకు తెచ్చారు. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిందని ఫైర్ సర్వీస్ ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. ఈ ఘటనలో డబ్బింగ్ స్టూడియోలోని సౌండ్ సిస్టమ్ పరికరాలు దగ్ధమయ్యాయి. రూ.10 లక్షల ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు.