
- తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే తెలంగాణ జాతిపిత అని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం డిమాండ్ చేసింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు డా. మదన్మోహన్, ప్రధాన కార్యదర్శి చోల్లేటి కృష్ణమాచారి మాట్లాడారు. జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు.
వరంగల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయానికి ఆచార్య జయశంకర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సేవలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో విశ్వకర్మలు పూర్తిగా అన్యాయానికి గురయ్యారని, తక్షణమే తమ కార్పొరేషన్ కు పాలకమండలి ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతి విశ్వకర్మణునికి పెన్షన్ ఇవ్వాలని కోరారు.