
నువ్వేమైనా అరవింద్ స్వామి అనుకుంటున్నావా? 20ఏళ్ల క్రితం మొదలైన ఈ మాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా హ్యాండ్సమ్గా ఉన్నానని ఫీలయిపోతుంటే వెంటనే వేసే సెటైర్ ఇది. నోటికి అలవోకగా వచ్చేస్తుంది. ఎందుకంటే తన గ్లామర్తో అంతగా ఆకట్టుకున్నారు అరవింద్ స్వామి. ఆ గ్లామర్ పుట్టింది ఇవాళే. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..
క్రేజీ ఎంట్రీ
మణిరత్నం సినిమాలో నటించాలని అందరూ కలలు కంటారు. కానీ కొందరికే అది సాధ్యమవుతుంది. అయితే తన కెరీర్ని ఆయన సినిమాతోనే మొదలుపెట్టిన లక్కీ యాక్టర్ అరవింద్ స్వామి. రజినీకాంత్, మమ్ముట్టి హీరోలుగా నటించిన దళపతిలోని మరో కీలక పాత్రకి అరవింద్ని సెలెక్ట్ చేసుకున్నారు మణి. ఇందులో దందాలు చేసే హీరోల ఆట కట్టించాలనుకునే డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్యారెక్టర్ లో ఆయన నటించి మెప్పించారు. ఆయన్ని చూసి ఎవరబ్బా ఇంత కూల్గా, ఇంత అందంగా ఉన్నాడు అనుకున్నారంతా. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అడుగుపెడుతూనే అద్భుతమైన విజయాన్ని బ్యాగ్లో వేసుకున్నట్టయ్యింది అరవింద్కి.
కలల రాకుమారుడు
సాధారణంగా హీరోయిన్ల గ్లామర్ గురించి, హీరోల మేనరిజమ్స్ గురించి చర్చలు జరుగుతుంటాయి. కానీ అరవింద్ స్వామి ఇందుకు అతీతం. ‘దళపతి’ తర్వాత మరణిరత్నం డైరెక్షన్లోనే రోజా, బొంబాయి సినిమాలు చేశాడు అరవింద్. ఈ రెండు సినిమాలూ కూడా పేట్రియాట్రిక్ టచ్ ఉన్న ప్రేమకథలే. దాంతో అరవింద్ స్వామి పేరు చెబితేనే అమ్మాయిలు ఊహల్లో తేలిపోయేవారు. అతనిలో తమ కలల రాకుమారుడిని చూసుకుని..అలాంటివాడే కావాలని పట్టుబట్టేవారు. అంత బాగా అరవింద్ పాత్రల్ని మలిచారు మణి. ‘నా చెలి రోజావే’ అంటూ మధుబాలని తలచుకుని అరవింద్ కుమిలిపోతుంటే ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయ్యారు. ‘ఉరికే చిలకా వేచి ఉంటానె కడవరకు’ అంటూ కలవరపడుతుంటే అతని కంటే ఎక్కువగా ఆడియన్స్ దిగులు పడిపోయారు. ఆ రేంజ్లో ఉండేది అరవింద్ స్వామి ఫాలోయింగ్.
ఒడిదుడుకుల ప్రయాణం
‘దళపతి’ చేశాక వెంటనే ‘రోజా’ చేసి హిట్టు కొట్టిన అరవింద్ స్వామి.. మళ్లీ సక్సెస్ అందుకుంది ‘బొంబాయి’తోనే. ఆ మధ్యలో తీసిన సినిమాలు అంతంతమాత్రమే. ‘బొంబాయి’ తర్వాత చేసిన సినిమాల విషయంలో అతని పాత్రలకు మంచి పేరు వచ్చింది తప్పా అతడు చేసిన చిత్రాలకు రాలేదు. ఇందిర, మౌనం, దేవరాగం లాంటి వాటికి మంచి చిత్రాలుగా పేరు వస్తే రావొచ్చు కానీ కమర్షియల్గా అనుకున్నంత విజయం సాధించలేదు. మలయాళం, బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా అంతగా కలిసి రాలేదు. అంతలోనే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరమై, సుమారు ఏడేళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘ధృవ’ మూవీలో విలన్ పాత్ర పోషించారు. ఆ సినిమాకి ఆయన ఎసెట్ అని చెప్పొచ్చు. అరవింద్ స్వామి కెరీర్లోని బెస్ట్ క్యారెక్టర్స్లో ఇది ఒకటి. మణిరత్నం తీసిన ‘నవాబ్’లోనూ కాస్త నెగిటివ్ షేడ్స్ లోనే కనిపించారు. ప్రస్తుతం ఐదారు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అరవింద్.
సవాళ్లను ఎదుర్కొంటూ..
వ్యక్తిగత జీవితంలోనూ చాలా సవాళ్లే ఎదుర్కొన్నారు అరవింద్ స్వామి. 1970లో చెన్నైలో నటుడు ఢిల్లీ కుమార్, గాయత్రిలకు అరవింద్ జన్మించారు. అయితే ఫిలాంత్రఫిస్ట్ వీడీ స్వామి, క్లాసికల్ డ్యాన్సర్ వసంత దంపతులు అరవింద్ని అడాప్ట్ చేసుకున్నారు. మద్రాస్ లయోలా కాలేజ్లో డిగ్రీ పూర్తయ్యాక, యూఎస్ వెళ్లి ఇంటర్నేషనల్ బిజినెస్లో పీజీ చేశారు. డాక్టర్ అవ్వాలనేది అరవింద్ కల. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశారు. అప్పుడే ఓ యాడ్లో అరవింద్ని చూసి తన సినిమాకి తీసుకున్నారు మణిరత్నం. నిజానికి అరవింద్కి సినిమాలంటే ఇష్టం లేదు. కానీ తండ్రి బలవంతం మీద డాక్టర్ డ్రీమ్ను వదిలేసి యాక్టర్ అయ్యారు. అయితే కొన్నాళ్ల తర్వాత తమ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సి రావడంతో సినిమాలకు దూరమయ్యారు. కానీ నటన మీద అప్పటికే మక్కువ పెరగడంతో తిరిగి కెమెరా ముందుకు రావాలనుకున్నారు. అయితే అంతలోనే మేజర్ యాక్సిడెంట్ అయి వెన్నెముకకి దెబ్బ తగలడంతో కాళ్లు ప్యారలైజ్ అయ్యాయి. కోలుకోడానికి కొన్నేళ్లు పట్టింది. మనస్పర్థలు తలెత్తడంతో అరవింద్ దంపతులు విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరి బాధ్యతని తనే తీసుకున్న అరవింద్..కొన్నాళ్లకు అపర్ణ ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు.
ఇలా జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చారు అరవింద్. లైఫ్ ఎన్ని మలుపులు తిరిగినా తిరిగి కెమెరా ముందుకే చేరుకున్నారు. ప్రేక్షకుల్ని అలరించడానికే ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. అదే తనకిష్టం అంటున్నారు. రీసెంట్గా ‘తలైవి’లో ఎంజీ రామచంద్రన్ పాత్రని అద్భుతంగా పోషించి మెప్పించారు. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాలం మారింది..సినిమా తీరూ మారింది. కానీ అరవింద్ స్వామిలో ఇప్పటికీ నాటి గ్లామర్ ఉంది. ఆయన పట్ల ప్రేక్షకుల అభిమానమూ అలానే ఉంది. అది ఆయన్ని నటుడిగా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది.