బరువైన పాత్రలకు కేరాఫ్ గుమ్మడి

బరువైన పాత్రలకు కేరాఫ్ గుమ్మడి

చిన్న వయసులోనే బరువైన పాత్రలు పోషించారు. మెథడ్‌ యాక్టింగ్‌కి మీనింగ్‌ తెలిసేలా చేశారు. పాజిటివ్‌, నెగిటివ్‌ క్యారెక్టర్‌ ఏదైనా అందులో జీవించాల్సిందే. లీడ్ రోల్ అయినా అతిథి పాత్రైనా.. ఆ సినిమాపై తనదైన ముద్ర వేయాల్సిందే.  అతను ఎవరో కాదు గుమ్మడి వెంకటేశ్వర్ రావు. ఏ పాత్ర అయినా అలవోకగా చేసే గుమ్మడి నటన అందరికీ గుర్తుండిపోయింది. ఇవాళ గుమ్మడి జయంతి సందర్భంగా ఆయనను ఓసారి గుర్తు చేసుకుందాం.

అదృష్టదీపుడు సినిమాతో తెరంగేట్రం

గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, రావికంపాడు గ్రామంలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు గుమ్మడి వెంకటేశ్వరరావు.  ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుకున్నారు. చిన్నప్పటి నుంచీ కమ్యూనిస్టు భావజాలాన్ని ఒంటబట్టించుకోవడంతో కాలేజ్‌కు పంపితే దారి తప్పుతాడేమోనని భయపడిన తల్లిదండ్రులు, పదిహేడేళ్ల వయసులోనే ఆయనకి పెళ్లి చేసేశారు.  నాటకాలపై ఉన్న ఆసక్తితో ‘ఆంధ్ర నాట్యమండలి’ పేరుతో నాటక సమాజాన్ని ప్రారంభించారు. ‘అదృష్టదీపుడు’ చిత్రంలో గుమ్మడి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నవ్వితే నవరత్నాలు, ప్రియురాలు, పేరంటాలు తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు.

400లకుపైగా సినిమాలు

నిజానికి కెరీర్ తొలి నాళ్లలోనే గుమ్మడికి హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. ఎస్వీ రంగారావు మేనమామ బీవీ రామానందం గుమ్మడిని హీరోగా జమున హీరోయిన్ గా ‘జై వీర బేతాళ’ సినిమా ప్లాన్ చేశారు. టెస్ట్ షూట్స్ కూడా జరిగాక రామానందం చనిపోవడంతో సినిమా ఆగిపోయింది.   బరువైన పాత్రలు, వయసు పైబడిన పాత్రల్లో ఆయన జీవించేవారు. ఆయన చేసిన చాలా సినిమాల్లో గుండెనొప్పితో పడిపోయే సీన్ ఉండేది. గుమ్మడి తెలుగులో నాలుగొందలకుపైగా సినిమాలు చేశారు. హిందీలో రెండు, తమిళంలో రెండు చిత్రాలు చేశారు.

పక్షవాతంతో నటనకు దూరం ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిన గుమ్మడికి మరో మలుపు సినిమాకి  ఉత్తమ సహాయ నటుడిగా నంది, రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో  సత్కరించింది. అవార్డుల కన్నా ప్రేక్షకుల ఆదరణ గొప్పదని గుమ్మడి నమ్మేవారు. ఓ రోజు హఠాత్తుగా పక్షవాతానికి గురయ్యారు. నటించడానికి ఇబ్బంది లేకపోయినా గొంతు సహకరించేది కాదు. దాంతో వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించాల్సి వచ్చేది. అది గుమ్మడికి నచ్చేది కాదు. ‘ఆయనకి ఇద్దరు’ మూవీ టైమ్‌లో గొంతు పూర్తిగా దెబ్బ తినడంతో ఆ తర్వాత నటించడానికి ఇష్టపడలేదు. ఏడేళ్ల తర్వాత ‘రేపల్లెలో రాధ’ మూవీ చేశారు. ఆ తర్వాత ‘ధర్మచక్రం’లో కనిపించారు. ‘జగద్దురు శ్రీ కాశీనాయన చరిత్ర’ సినిమా తర్వాత నటించడం పూర్తిగా మానేశారు. చిత్రసీమలోని అనుభవాలను ‘తీపి జ్ఞాపకాలు – చేదు గుర్తులు’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు గుమ్మడి.

హుందాతనం

కొద్ది మాటల్లో చెప్పేయగలిగే కెరీర్ కాదు గుమ్మడిది. కొన్ని దశాబ్దాల పాటు తన నటనా పటిమతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఘనత ఆయన సొంతం. సౌమ్యుడిగా, హుందాతనం కలిగిన వ్యక్తిగా అందరి ప్రశంసలు పొందే వ్యక్తిత్వం ఆయనది.  2010 జనవరి 26న అనారోగ్య సమస్యలతో ఈ లోకం వదలి వెళ్లిపోయినా తాను చేసిన పాత్రలతో ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నారు.