ప్రకాష్ రాజ్ వర్సెస్ నాగబాబు.. పవన్ కళ్యాణ్‌ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారు

ప్రకాష్ రాజ్ వర్సెస్ నాగబాబు.. పవన్ కళ్యాణ్‌ ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీకి సపోర్ట్ చేయడాన్ని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ స్థిరత్వ లేకుండా.. ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారంటూ ప్రకాశ్ రాజ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన పోటీ విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పవన్ నిర్ణయం ఆ పార్టీ నేతలకు కూడా నచ్చలేదని ఆయన అన్నారు. ఓ సినిమా షూటింగ్ కోసం నగరానికి వచ్చిన ప్రకాశ్ రాజ్.. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం పొత్తుపెట్టుకున్న జనసేన, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు.

పవన్ 2019 ఏపీ ఎన్నికల్లో బీజేపీని తిట్టిపోశారని.. మళ్లీ ఇప్పుడు మద్ధతు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. ‘ఆయనకు ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయాలతో నిజంగా చాలా నిరాశకు గురయ్యాను. నువ్వు ఒక నాయకుడివి. మీకు జనసేన అనే పార్టీ ఒకటి ఉంది. మీరు మరో నాయకుడివైపు చూడటం ఏంటి? ఆంధ్రాలో మీ ఓట్ షేర్ ఏంటి? బీజేపీ ఓట్ షేర్ ఏంటి? మీరెందుకు బీజేపీ భుజం ఎక్కారు? 2014 ఎన్నికల సమయంలో మీరే స్వయంగా వెళ్లి ఇంద్రుడు, చంద్రుడు అంటూ మోదీకి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఏపీకి బీజేపీ ద్రోహం చేసిందంటూ రివర్స్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు మీకు మోదీ నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇలా ప్రతిసారి ఊసరవెల్లిలా మారుతున్నారు. మరొకరి భుజం మీద కూర్చోవడం కంటే జనసేన పార్టీని నేరుగా బీజేపీలోనే కలిపేస్తే సరిపోతుంది కదా? పవన్‌కు అసలు మనస్సాక్షి అనేది లేదా? ’ అంటూ పవన్ కళ్యాణ్ తీరును ప్రకాష్ రాజ్ తప్పబట్టారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపైనా ప్రకాష్ రాజ్ తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ నుంచి వస్తున్న బీజేపీ నాయకులు కుల, మతాల పేరుతో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్‌కి యాక్టర్ నాగబాబు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ని ఊసరవెల్లితో పోల్చిన ప్రకాశ్ రాజ్‌ను.. మనిషిగా మారాలని నాగబాబు కోరారు. ఓ డిబెట్‌లో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి ప్రకాశ్ రాజ్‌ని తొక్కి నారతీస్తుంటే తడబడటం తనకు ఇంకా గుర్తుందని నాగబాబు అన్నారు.

‘రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకు కృషిచేయడం వెనుక విస్తృత ప్రజాప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం. ఎవడికి కళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడు. మిస్టర్ ప్రకాశ్ రాజ్ నీ రాజకీయ డొల్లతనం ఏంటో బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి డిబేట్‌లోనే అర్థం అయింది. సుబ్రహ్మణ్య స్వామి నిన్ను తొక్కి నారతీస్తుంటే మాట్లడలేక తడబడటం నాకు ఇంకా గుర్తుంది. నీ ఉద్దేశ్యంలో బీజేపీ తీసుకొన్న నిర్ణయాలు నీకు ఇష్టం లేకపోతే విమర్శించు తప్పులేదు. అలాగే బీజేపీ గాని, మరే పార్టీ గాని ప్రజలకు మంచిచేసినా హర్షించగలగాలి. విమర్శించటం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం. ఒకటి మాత్రం చెప్పగలను. ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీతో, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. నీ లాంటి కహానా మేధావులు ఎన్ని వాగినా బీజేపీ జనసేన కూటమి శక్తిని ఆపలేరు. నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింస పెట్టావో, ఇచ్చిన డేట్ప్‌ని క్యాన్సల్ చేసి ఎంత హింసకి గురిచేశావో ఇంకా గుర్తున్నాయి ప్రకాశ్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి, నిస్వార్థ పరుడైన నాయకుడిని విమర్శించు. డైరెక్టర్స్‌ని కాకా పట్టి నిర్మాతలని కాల్చుకు తిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడ్డం ఏం తెలుసు. బీజేపీ నాయకత్వాన్ని నువ్వు నోటికొచ్చినట్లు విమర్శించినా నిన్ను ఎవరు ఏం అనలేదంటే అది బీజేపీ డెమొక్రసీకి ఇచ్చే విలువ అని అర్థం చేసుకో. బీజేపీ, జనసేన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో కచ్చితంగా తమ సత్తా చాటుకోబోతున్నాయి. మీడియా అడిగింది అని ఒళ్లు పొంగి నీ పనికిమాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు’ అని ట్వీట్ చేశారు.

For More News..

కూతురుతో కలిసి అల్లుడింట్లో అత్త చోరీ

అధికార పార్టీకి ఇండిపెండెంట్ల టెన్షన్

ఇవ్వాల ఉన్నం.. రేపు ఉంటమో లేదో.. దోస్త్​కు మెసేజ్‌ చేసిన తెల్లారే టెర్రరిస్టుల దాడిలో సోల్జర్ మృతి