
Adani Defence: ఆపరేషన్ సిందూర్ దాదాపు రెండు నెలల కిందట జరిగింది. అప్పట్లో భారత సాయుధ దళాలు శత్రుదేశంలోని ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్ చేసుకుని అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టిన దాడులు చెమటలు పట్టించాయి. దీంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ భారతదేశంలోని ప్రజల నివాసాలు, దేవాలయాలు, ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగిన సంగతి తెలిసిందే.
దేశరక్షణ కోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో అదానీ గ్రూప్ కూడా భాగంగా తనవంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించిందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. ఈ క్రమంలో అదానీ డిఫెన్స్ సంస్థ డెలివర్ చేసిన డ్రోన్లు గాల్లో రక్షణ కవచంలా నిలబడ్డాయని, అలాగే తాము తయారు చేసిన యాంటీ డ్రోన్ పరికరాలు మిలిటరీతో పాటు సామాన్యుల ప్రాణాలను రక్షించటంలో అండగా నిలిచాయన్నారు. తాము దేశానికి ఎక్కడ అవసరమో అలాంటి రంగాల్లోనే వ్యాపారాన్ని కొనసాగిస్తూ అభివృద్ధిలో భాగస్వాములమౌతామన్నారు.
ఈ క్రమంలో అదానీ దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ధైర్యంగా మహిళా సైనికులు కూడా యుద్ధంలో భాగస్వాములుగా నిలిచారన్నారు. ఆపరేషన్ సిందూర్ భారత్ శాంతికి ఎంత విలువను ఇస్తుందనే విషయాన్ని చూపిందని అన్నారు. అవతలి వ్యక్తి దేశంపై కన్నేస్తే వారికి సరైన మార్గంలో బుద్ది చెప్పటం భారత్ కి తెలుసని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో వినియోగించిన స్కై స్ట్రైకర్ కామికాజీ డ్రోన్లను అదానీ గ్రూప్ సంస్థ ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ ఇజ్రాయెల్ సంస్థ ఇల్బిట్ సెక్యూరిటీస్ భాగస్వామ్యంతో తయారు చేసింది. ఇవి 5 నుంచి 10 కేజీల పేలుడు పదార్థాలను తమతో తీసుకెళ్లి టార్గెట్లను సమర్థవంతంగా నాశనం చేయగలవని నిరూపించబడింది. అలాగే అదానీ గ్రూప్ తయారు చేసిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు శత్రువులు ఉపయోగించిన డ్రోన్లను అడ్డుకోవటంలో సమర్థవంతంగా సేవలను అందించాయి. ఇలా అదానీ గ్రూప్ అఫెన్సివ్, డిఫెన్సివ్ సేవలను యుద్ద భూమిలో అందించి దేశరక్షణలో తన పాత్రను చూపింది.