- ఎల్లారెడ్డిగూడలో ఘటన
పంజాగుట్ట, వెలుగు : పబ్జీ గేమ్ కు బానిసై డిగ్రీ స్టూడెంట్ సూసైడ్ కు పాల్పడిన ఘటన పంజాగుట్ట పీఎస్ పరిధిలో జరిగింది. ఎస్ఐ జె. మహేశ్ తెలిపిన ప్రకారం... ఏపీలోని అల్లూరు జిల్లా జీకే వీధి మండలం మాలికగూడకు చెందిన జయ భర్త చనిపోగా.. బతుకుదెరువుకు కొడుకుతో కలిసి కొన్నాళ్ల కిందట సిటీకి వచ్చి ఎల్లారెడ్డిగూడలో ఉంటుంది.
ఆమె కొడుకు అఖిల్(21) సిటీలోని ఓ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మూడు నెలలుగా అతడు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ మొబైల్ లో నిత్యం పబ్జి గేమ్ ఆడుతూ బానిసగా మారడమే కాకుండా డిప్రెషన్ లోకి వెళ్లాడు.
ఈనెల 3న రాత్రి ఇంట్లో ఎవరూ లేనప్పుడు అఖిల్ సీలింగ్ కు ఉరేసుకున్నాడు. తల్లి వచ్చి డోర్ కొట్టగా తీయకపోవడంతో పగల కొట్టి చూడగా అఖిల్ సీలింగ్కు వేలాడుతూ కనిపించగా దింపి వెంటనే నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స అందిస్తుండగా అఖిల్ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈనెల 4న తల్లి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.