
పెద్దమందడి, వెలుగు: భూభారతి రెవెన్యూ సదస్సులతో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత చేరువయ్యాయని వనపర్తి అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నమందడిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన సందర్శించారు. గ్రామ సందర్శనలో భాగంగా, గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు గ్రామస్తులకు పూర్తి స్థాయిలో సహకరించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
ధాన్యం అన్లోడ్ స్పీడప్ చేయాలి
పెబ్బేరు: రైస్ మిల్లుల వద్ద వాహనాలు క్యూ కట్టాయని, ధాన్యం అన్లోడింగ్ స్పీడప్ చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మిల్లుల యజమానులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సప్తగిరి, సాయి గోపాల్ రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మిల్లు యజమానులపై ఉందన్నారు.