కేసీఆర్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు : కేఏ పాల్

కేసీఆర్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు : కేఏ పాల్

కేసీఆర్ పై పోరాటంలో తగ్గేది లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు అన్న పాల్... మీరు వెళ్లే మార్గం సైతాన్ మార్గమని విమర్శించారు. తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం ప్రజాశాంతి పార్టీ పెట్టానని, కేసీఆర్ వైఖరి మార్చుకోవాలని కోరానన్నారు. కానీ ఆయన తన వైఖరిని మార్చుకోకపోవడంతో పతనం అంచుకు చేరుకున్నారని కామెంట్ చేశారు. కేసీఆర్ కు ఇది ఆరంభం మాత్రమేనన్న పాల్... ముందు ముందు చాలా ఉందని హెచ్చరించారు. రూ.5లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం చేశారని ఆరోపించారు. దాని వల్ల కనీసం తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు ఎవరికీ న్యాయం జరగలేదని చెప్పారు. ఏప్రిల్14వ తేదీ అంబేద్కర్ జన్మదినం రోజు తెలంగాణ సచివాలయం ప్రారంభం కావాలని కోరుకుంటున్నానని, దాని కోసమే పోరాటం చేస్తున్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీ టీం అని ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవం విషయంలో కేసీఆర్ నాటకం ఆడుతున్నారని కేఏ పాల్ చెప్పారు. తెలంగాణలో ముగ్గురు శాసన సభ్యులు తనతో టచ్ లో ఉన్నారని, ప్రజాశాంతి పార్టీలో ఎవరైనా చేరే అవకాశం ఉందని పాల్ హింట్ ఇచ్చారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముగ్గురు శాసన సభ్యులు ఎవరనేది తెలుసుకోవచ్చునన్న  పాల్... తాను ఎవరితో మాట్లాడుతున్నాననేది కూడా తెలుసుకోవచ్చని చెప్పారు. దేశాన్ని, దేశ ప్రజలను ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ దోచుకుంటోందని ఆరోపించారు.