కన్నూర్: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో లక్షలాది మంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రధాని మోదీ వారి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. గల్ఫ్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆమె విమర్శించారు. ఈ మేరకు సోమవారం కేరళలోని పేరావూర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రియాంక గాంధీ వాద్రా ప్రసంగించారు.
‘‘అమెరికా, ఇజ్రాయెల్ ముందు మోకరిల్లడంలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని మోదీకి తలొగ్గడంలో బిజీగా ఉన్నారు” అని ఎద్దేవా చేశారు. దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం ఎనర్జీ సెక్టార్ను అమెరికాకు ధారాదత్తం చేసిందని ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. ‘‘మనం చమురు ఎక్కడ కొనాలి, ఎవరి దగ్గర కొనాలి, ఎలా కొనాలి అనేది ఇప్పుడు అమెరికా నిర్ణయిస్తున్నది’’ అని ప్రియాంక విమర్శించారు.
- రైతు ప్రయోజనాలకు దెబ్బ
అమెరికాలోని భారీ యాంత్రీకృత వ్యవసాయ క్షేత్రాలతో భారతీయ రైతులు పోటీపడలేరని తెలిసినా కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందాలు రైతులకు శాపంగా మారబోతున్నాయని ప్రియాంక గాంధీ వాద్రా ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మనపై వారు సుంకాలను విధిస్తున్నారు. కానీ, మనం మాత్రం వారి కోసం పన్నులను తొలగించాం. అమెరికా నుంచి సుమారు రూ.9 లక్షల కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయబోతున్నాం. ఇలాంటి విధానాలు దేశ సమస్యలను మరింత పెంచుతాయి’’ అని చెప్పారు. మత రాజకీయాలు, అవినీతి దేశ ప్రగతిని వెనక్కి నెడుతున్నాయని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజలకు నమ్మకమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
