పవన్ కళ్యాణ్‌పై ఎల్బీనగర్ పీఎస్‌లో కేసు.. గద్దర్ అభిమానులు, లాయర్ల ఆగ్రహం.!

పవన్ కళ్యాణ్‌పై ఎల్బీనగర్ పీఎస్‌లో కేసు.. గద్దర్ అభిమానులు, లాయర్ల ఆగ్రహం.!

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చుట్టూ సరికొత్త వివాదం ముసురుకుంది. జూన్ 2న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పవన్ నిర్వహించిన ప్రెస్ మీట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారమే రేపుతోంది. తెలంగాణ ప్రజా గాయకుడు, దివంగత గద్దర్ పై పవన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త వివాదానికి దారితీసింది.

వివాదానికి కారణం ఏంటి? 

ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా.. గతంలో గద్దర్ అన్న తన వద్దకు వచ్చి కారు కావాలని అడిగారని, దాంతో తానే ఆయనకు ఒక కారును గిఫ్ట్‌గా ఇచ్చానని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. గద్దర్ లాంటి గొప్ప విప్లవ దళిత నాయకుడు ఒకరిని కారు అడిగే పరిస్థితిలో లేరని, ఆయన పరువు తీసేందుకే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

 ఎల్బీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు!

గద్దర్ అన్న ఇప్పుడు బతికి లేరు కాబట్టి, ఆయన వచ్చి సమాధానం చెప్పలేరనే ధీమాతోనే పవన్ ఈ కల్పిత కథలు చెబుతున్నారని తెలంగాణ ప్రముఖులు, అభిమానులు, లాయర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 3, 2026న న్యాయవాదులు ఫణీంద్ర భార్గవ్, రవికుమార్ వోడ్యారపు కలిసి హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు చేశారు.  పవన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, కల్పితం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల, దళిత సామాజిక వర్గాల భావాలను ఈ ప్రకటన తీవ్రంగా గాయపరిచింది.  ఒక మహోన్నత నాయకుడి లెగసీని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు

చట్టపరమైన చిక్కులు?

ఈ వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టించేలా ఉన్నాయంటూ భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పరువు నష్టం, ఉద్దేశపూర్వక అవమానం, శతృత్వాన్ని పెంచే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని లాయర్లు కోరారు. అంతేకాకుండా, గద్దర్ దళిత నేత కావడంతో SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఈ కారు గొడవపై జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయో, ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి..