ది హిందూ కథనం ప్రకారం..మేఘాలయ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విపరీతంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ కారణంగా పక్కనే ఉన్న అస్సాంలో 17వేలకు పైగా పందులు మరణించాయి. గౌహతి లో ఓ ప్రయోగశాలలో పందులపై టెస్ట్ లు చేయగా ..ఆ పందుల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కణాలు ఉన్నట్లు గుర్తించిన సైంటిస్ట్ లు పూర్తి స్థాయిలో నిజనిర్ధారణకోసం నమూనాల్ని భూపాల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు.
దీంతో పాటు మేఘాలయకు చెందిన మూడు జిల్లాల్లో తొమ్మిది పందులు మరణించాయి. వాటి నమూనాల్ని టెస్ట్ చేయగా ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కణాలు ఉన్నాయని జంతు ఆరోగ్య కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఇన్చార్జి ప్రదీప్ గొగోయ్ చెప్పారు.
ఫిబ్రవరి నెలలో వైరస్ వ్యాప్తి
2020 ఫిబ్రవరి నెల నుండి మేఘాలయా, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో ఈ వైరస్ వ్యాపించింది. వైరస్ వల్ల అస్సాంలో 17వేల పందులు చనిపోయానని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ లో వ్యాపించిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ చైనా నుంచి వ్యాప్తించినట్లు అక్కడి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019లో అరుణాచల్ ప్రదేశ్ లో ఈ వైరస్ వల్ల అనేక జంతువులు చనిపోయాయని నమ్ముతారు.
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్
వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ప్రకారం అడవి పందులు, దేశీయ పందుల్లో కనిపించే ఈ వైరస్ ఒక అంటు వ్యాధి అని , వేగంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని తెలిపింది. మృతదేహాల ద్వారా, ప్యాకేజ్డ్ పంది ఉత్పత్తుల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది.
పంది మాంసానికి డిమాండ్ ఎక్కువ
ఈశాన్య రాష్ట్రాల్లో పందిమాంసానికి డిమాండ్ ఎక్కువ. ఒక్క అస్సాం రాష్ట్రంలో సుమారు ఏడు నుంచి 10లక్షల మంది రైతులు పందులు వ్యాపారం చేస్తుంటారు. దీని ఆదాయం సంవత్సరానికి , 1000 నుంచి 8,000 కోట్లని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.