‘బైక్ పార్శిల్’ ప్లాన్ ఫెయిల్.. Rapido తెలివితేటలకు.. చెక్ పెట్టిన బెంగళూరు పోలీసులు

‘బైక్ పార్శిల్’ ప్లాన్ ఫెయిల్.. Rapido తెలివితేటలకు.. చెక్ పెట్టిన బెంగళూరు పోలీసులు

బెంగళూరు: కర్ణాటక హైకోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ర్యాపిడో తెలివిగా సరికొత్త వ్యూహానికి తెరలేపింది. ‘బైక్ ట్యాక్సీ’ సేవలపై నిషేధం విధించడంతో ‘బైక్ పార్శిల్’ పేరుతో కొత్త సర్వీస్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సర్వీస్ ద్వారా వస్తువులనే కాదు మిమ్మల్ని మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పార్శిల్ చేసుకోవచ్చు. అర్థం కాలేదా.. కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడంతో ‘బైక్ ట్యాక్సీ’ సేవలను కాస్తా ‘బైక్ పార్శిల్’ పేరుతో నడిపించాలని ర్యాపిడో చూసింది. అయితే.. ర్యాపిడో తెలివితేటలకు బెంగళూరు పోలీసులు చెక్ పెట్టారు.

ర్యాపిడో ‘బైక్ పార్శిల్’ డ్రైవర్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. జూన్ 16న ఒక్కరోజే నిషేధం ఆంక్షలను అతిక్రమించినందుకు 100 బైక్స్ను సీజ్ చేశారు. వెస్ట్ బెంగళూరు, బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ పరిధిలో 31 బైక్స్ను సీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. బెంగళూరులో బైక్ ట్యాక్సీలను నిషేధించడంపై సామాన్యులు భగ్గుమంటున్నారు. బైక్ ట్యాక్సీలను నిషేధించడంతో 65 నుంచి 75 రూపాయల ఖర్చు చేయడంతో ఆటోలకు 117 నుంచి 165 రూపాయల వరకూ చెల్లించాల్సి వస్తుందని మండిపడుతున్నారు. బైక్ ట్యాక్సీలను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని సోషల్ మీడియాలో బెంగళూరు జనం కోరుతున్నారు.