దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ సెగలు..

దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ సెగలు..

కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. గత రెండు రోజులుగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ విద్వంసం సృష్టించారు.. నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లు అన్నింటినీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. 

మరోవైపు బీహార్ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసనలు అదుపు తప్పాయి. దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని వారణాసిలో బస్సును ధ్వంసం చేశారు. వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ బయట వెండింగ్ కార్ట్ లను ధ్వంసం చేశారు. బలిలాలో స్టేషన్ వద్ద ఖాళీ రైలుకు నిప్పటించారు. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వే మార్గంలో బస్సును ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రా-నోయిడా యుమునా ఎక్స్ ప్రెస్ వే 165 కిలోమీటర్ల వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

బీహార్ లోని కుల్హారియా స్టేషన్ వద్ద అరా పాట్నా ప్యాసింజర్ రైలుకు నిప్పు పెట్టారు. నాలుగు బోగీలు దహనమయ్యాయి. దర్బంగా-న్యూఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ కు సమస్తిపూర్ రైల్వే స్టేషన్ వద్ద నిప్పు పెట్టడంతో మూడు బోగీలు కాలిపోయాయి. అలాగే, సహస్ర దర్బంగా ప్యాసింజర్ రైలుకు కూడా నిప్పు పెట్టారు. రెండు బోగీలు దహనమయ్యాయి. విక్రమ్ శిల ఎక్స్ ప్రెస్ కూడా అగ్నికి ఆహుతైంది. బెట్టియాలోని బీహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేణు దేవి నివాసంపైనా ఆందోళనకారులు దాడికి యత్నించారు. హర్యానాలోని ఫరీదాబాద్ బల్లబ్ గఢ్ ప్రాంతంలో ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగడంతో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేశారు. ఇక బుధవారం బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదలైన నిరసనలు మెల్లగా దేశమంతటా పాకుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది.