రైతులను మోసం చేసే.. సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోండి

రైతులను మోసం చేసే.. సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోండి

రైతులను మోసం చేసే సీడ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు  రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన 10 మంది రైతులు వరి ధాన్యం విత్తనోత్పత్తిలో మోస పోయామని రైతు కమిషన్ కు వచ్చి చైర్మన్ కోదండరెడ్డికి ఫిర్యాదు చేశారు. యాసంగి పంటలో వరి ధాన్యం  విత్తనోత్పత్తి కోసం శక్తి సీడ్ కంపెనీ ఒప్పందం చేసుకుందని ఆ సమయంలో పంట సాగుచేయడానికి ఉచితంగా వడ్లు, పెట్టుబడి సాయం కింద ఎకరాకు 20 వేలు, పంట పూర్తి అయ్యాక  క్వింటాల్ కు 12,500 చొప్పున చెల్లిస్తాము,ఎటువంటి కట్టింగ్ ఉండదని కంపెనీ తరుపున ఆర్గనైజర్లు హామీ ఇచ్చినట్లు రైతులు చెప్పారు. అయితే కాంట అయ్యాక, బస్తాలను లారీలోకి ఎక్కించాక.. క్వింటాల్ కు 10 కేజీల కట్టింగ్ ఉంటుందని చెప్పి తమను  మోసం చేశారని కుక్కడం గ్రామరైతులు కమిషన్ కు చెప్పారు. 

అయితే  రైతుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందన్ పవర్ తో పాటు వ్యవసాయ అధికారులకు జరిగిన అన్యాయాన్ని వివరించి, రైతులకు న్యాయం చేయాలని  సూచించారు. అంతేకాదు రైతులను మోసం చేసే సీడ్ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం పనిచేస్తుంటే.. సీడ్ కంపెనీల వ్యవహారం బాగాలేదన్నారు. కమిషన్ పై నమ్మకంతో వచ్చిన రైతులకు భరోసా ఇచ్చి పంపారు చైర్మన్ కోదండరెడ్డి .

ఆకలితో రైతు కమిషన్ గడప తొక్కిన అన్నదాత..

శక్తి సీడ్ కంపెనీ తమను మోసం చేసిందని కుక్కడం గ్రామ రైతులు.. రైతు కమిషన్ ను ఆశ్రయించారు. ఉదయం సూర్యాపేట నుండి బయలుదేరిన రైతులు మధ్యాహ్నం తర్వాత కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తినకుండా రైతులు కమిషన్ కు వచ్చిన విషయం తెలుసుకున్న కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.. రైతులకు సమోసా, చాయ్ ఇప్పించిన తర్వాతనే వారి ఆవేదనను తెలుసుకున్నారు. వారికీ జరిగిన మోసం పై కలెక్టర్ కు వ్యవసాయ ఉన్నతాధికారులకు వివరించి తక్షణమే న్యాయం చేయాలని సూచించారు.