చదువు లేకున్నా కలుపు తీసే మిషన్ తయారు చేసిన రైతు

చదువు లేకున్నా కలుపు తీసే మిషన్ తయారు చేసిన రైతు

మెదక్ జిల్లా: కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు ఓ రైతు. చదువు రాకున్నా తనకున్న టాలెంట్ తో పొలంలో కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో యంత్రాన్ని తయారు చేసి.. తన తోటి రైతులకు బాసటగా నిలుస్తున్న ఓ అన్నదాతపై స్పెషల్ స్టోరీ. వ్యవసాయం ఆధునిక పద్దతిలో చేసేందుకు అన్నదాతలు ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు నాగళ్లు, కూలీలతో చేసిన పనులను ఇప్పుడు.. ట్రాక్టర్లు, వరినాట్లు వేసే మిషిన్లు, వరి కోత మిషిన్లతో పనులు ఈజీగా చేసుకుంటున్నారు. కొన్నిసార్లు సమయానికి కూలీలు దొరక్క కూడా రైతులు ఇబ్బంది పడేవాళ్లు.

దీంతో మెదక్ జిల్లా అల్లాదుర్గంకు చెందిన సాయిలు అనే రైతు.. కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు.  కూలీలకు డిమాండ్ పెరిగి ఎక్కువ డబ్బులు చెలించాల్సి వస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని గ్రహించి.. కొన్యాల సాయిలు అనే రైతు ఈ యంత్రాన్ని తయారు చేశారు. యూ ట్యూబ్ సాయంతో పొలంలో కలుపు తీసే మిషన్ తయారు చేశాడు. దీని తయారికి కావాల్సిన పరికరాలను 20 వేలతో కొనుగోలు చేశాడు. ఈ మిషన్ తయారీకి  ఆరు నెలల సమయం పట్టిందంటున్నాడు రైతు సాయిలు.

అయితే ఈ యంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉందంటున్నారు రైతులు. పత్తి, జొన్న, మిరప పంటలో కలుపు తీయడానికి కనీసం 10 మంది కూలీలు కావాలి. కానీ ఈ యంత్రంలో ఒక్క లీటర్ డీజిల్ పోస్తే .. ఎకరం పొలం కలుపు తీయొచ్చంటున్నారు. తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసిన రైతును.. తోటి రైతులు అభినందిస్తున్నారు.