- రూ.617 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.158 కోట్లు మాత్రమే రికవరీ
- ములుగు జిల్లాలో అతితక్కువగా 109 ఫిర్యాదులు రూ.57 లక్షలు లూటీ
- అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ పోలీసులు
హైదరాబాద్,వెలుగు: ఆన్లైన్ అడ్డాగా సాగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు.సైబర్ సేఫ్టీపై పోలీసులు ఎంత ప్రచారం చేస్తున్నా జనం పట్టించుకోవడం లేదు. తక్కువ టైంలో ఎక్కువ లాభాల ఆశచూపుతూ సైబర్ మోసగాళ్లు ఆన్లైన్ దోపిడీ చేస్తున్నారు. ఇలా సైబర్ నేరాల్లో కోల్పోయిన సొమ్ములో రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా జరుగుతున్న సైబర్ నేరాల్లో కేవలం 10 శాతం మాత్రమే రికవరీ ఉంటోంది.
ఇందుకు కారణం గోల్డెన్ అవర్స్లో బాధితులు ఫిర్యాదు చేయకపోవడమేనని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు కొండంత కొల్లగొడుతుంటే.. పోలీసులు మాత్రం అతి కష్టం మీద గోరంత నగదును రికవరీ చేయగలుగుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.617 కోట్లు సైబర్ నేరగాళ్లు లూటీ చేయగా.. ఇందులో కేవలం రూ.158 కోట్లు మాత్రమే పోలీసులు హోల్డ్ చేయగలిగారు. కాగా, గతేడాది మొదటి ఆరు నెలలతో పోల్చితే ఈ ఏడాది రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య స్వల్వంగా తగ్గింది.
సైబర్ నేరగాళ్ల వల ఇలా..
సైబర్ మోసాల్లో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అత్యాశకు రూ.కోట్లు పోగుట్టుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల ఓ మాజీ పోలీస్ అధికారి భార్య కూడా సైబర్ నేరగాళ్ల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో రూ.2.58 కోట్లు కోల్పోయారు. ఇలా దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న సైబర్నేరాల్లో హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కర్నాటకకు చెందిన బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు, మెట్రో సిటీలను సైబర్నేరగాళ్లు టార్గెట్గా చేసుకున్నారు.
డార్క్వెబ్ సైట్లలో కొనుగోలు చేసిన ఫోన్ నంబర్స్, ఏజెన్సీల ద్వారా కలెక్ట్ చేసిన బ్యాంక్ అకౌంట్స్తో వరుస మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఫెడెక్స్ కొరియర్, డ్రగ్స్, కస్టమ్స్, ట్రాయ్, సీబీఐ, సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
గ్రేటర్లోనే 445.82 కోట్లు లూటీ
ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో గ్రేటర్ పరిధిలో రూ.445 .82 కోట్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో గ్రేటర్లోని నాలుగు కమిషనరేట్లలో ఎక్కువగా సైబర్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. ఇందులో ఐటీ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ నేరాల్లో ప్రతి ఏటా మొదటి స్థానంలో నిలుస్తున్నది. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్ కమిషనరేట్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
వీటితో పాటు మల్కాజ్ గిరి, వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైబర్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ములుగు జిల్లాలో అత్యంత తక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ ఆరు నెలల వ్యవధిలో 109 మంది బాధితులు రూ.57.33 లక్షలు కోల్పోగా.. ఇందులో రూ.13.45 లక్షలు మాత్రమే పోలీసులు ఫ్రీజ్ చేయగలిగారు.
గోల్డెన్ అవర్స్లో ఫిర్యాదు చేయకపోవడమే కారణం
‘‘సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన 1930 హెల్ప్లైన్ మంచి ఫలితాలను ఇస్తున్నది. సైబర్ మోసాల్లో బాధితులు కోల్పోయిన డబ్బును తిరిగి వారికి అప్పగించేందుకు యత్నిస్తున్నాం. ఈ ఏడాది ఆరునెలలో రూ.158 కోట్లు ఫ్రీజ్ చేశాం. స్టాక్ మార్కెట్ లాంటి సైబర్ మోసాలకు గురవుతున్న బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో రికవరీ శాతం తగ్గుతోంది. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది. సైబర్ నేరగాళ్ల అకౌంట్ల నుంచి డబ్బు విత్డ్రా కాకముందే హోల్డ్ చేయగలుగుతాం. సైబర్ నేరాల కట్టడికి అవగాహన ఒక్కటే మార్గం"
- శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
