ఆగస్టు 7న  బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభ

ఆగస్టు 7న  బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభ
  • 80 కోట్ల బీసీల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా
  • వాల్ పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించిన ఓబీసీ జాతీయ నేతలు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకతీతంగా ఐక్యం కావాలని, వారిని ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే నెల 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం బెంగళూరులోని కాస్మోపాలిటన్ క్లబ్‌‌లో ఈ మహాసభకు సంబంధించి ఒక సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

అనంతరం వివిధ రాష్ట్రాల ఓబీసీ నేతలతో కలిసి మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది బీసీల డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా, రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మండల కమిషన్ సిఫారసులు అమలు చేసిన రోజును పురస్కరించుకుని ఏటా జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ ఏడాది 11వ జాతీయ మహాసభను బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని జాజుల, ప్రొఫెసర్ బాబాన్ రావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ కేశన శంకర్ రావు తెలిపారు.