
హైదరాబాద్, వెలుగు: అగ్రిగోల్డ్ గ్రూప్ సంస్థలకు చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన దాదాపు రూ.611 కోట్లు విలువైన ఆస్తులను తిరిగి బాధితులకు ఇచ్చేందుకు ఈడీ అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఈ మేరకు అనుమతి కోరుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎదుట గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం ఈ నెల 10న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో వ్యవసాయ భూమి, నివాస, వాణిజ్య సముదాయాలు సహా మొత్తం 397 స్థిరాస్తులను బాధితులకు తిరిగి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
ఈ వివరాలను ఈడీ జాయింట్ జేడీ రోహిత్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదే కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రూ.3,339 కోట్ల విలువైన ఆస్తులను అర్హులైన బాధితులకు తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.