ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు.. దీపావళి బోనస్‌ ప్రకటన

ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు.. దీపావళి బోనస్‌ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ, గ్రూప్‌ బీలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. దీపావళికి ముందు కేంద్రం తన ఉద్యోగులకు బోనస్‌ను ప్రకటించింది. కేంద్ర పారామిలటరీ, సాయుధ బలగాలకు చెందిన అర్హులైన ఉద్యోగులకు కూడా బోనస్ వర్తిస్తుంది. ఈ ఆర్డర్‌ల కింద బోనస్ చెల్లింపు గరిష్ట పరిమితి రూ.7 వేల నెలవారీ జీతం అని చెప్పింది. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఉద్యోగులు గ్రూప్ సీ, డీ, కాంట్రాక్టు ఉద్యోగులు ఈ సంవత్సరం బోనస్ పొందుతారని చెప్పింది. పారామిలటరీ బలగాలతో సహా గ్రూప్ సీ, నాన్-గెజిటెడ్ గ్రూప్ బీ ర్యాంక్ అధికారులకు గరిష్ఠ పరిమితి రూ.7వేలతో దీపావళి బోనస్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 2021 మార్చి 31వతేదీ నాటికి సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో కనీసం ఆరు నెలల పాటు నిరంతర సేవలను అందించిన ఉద్యోగులు ఈ తాత్కాలిక బోనస్‌కు అర్హులని కేంద్రం వివరించింది.

Also Read :- దసరా బంపరాఫర్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)లో 4 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బుధవారం (అక్టోబర్ 18న)  జరిగే భేటీ తర్వాత కేంద్ర మంత్రివర్గం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కరవు భత్యాన్ని ప్రస్తుతం 42 శాతం నుంచి 46 శాతానికి పెంచే అవకాశం ఉంది. 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,69.76 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ఏడాది మార్చిలో కేంద్ర మంత్రివర్గం కరవు భత్యం, డియర్‌నెస్ రిలీఫ్‌లను 4 శాతం పెంచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీపావళికి కొన్ని వారాల ముందు కేబినెట్ అదనపు డీఏను 4 శాతం పెంచింది.