- సీపీ గుర్నానితో సహా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లపై కూడా
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రాపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. కంపెనీ తయారు చేస్తున్న మల్టీపర్పస్ వెహికల్ (ఎంపీవీ) స్కార్పియో వాడుతున్న ఓ వ్యక్తి యాక్సిడెంట్కు గురికావడంతో ఆయనపై కేసు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, మరో 11 మందిపై కూడా కేసు వేశారు ఉత్తర ప్రదేశ్కు చెందిన రాజేష్ మిశ్రా. వీరిలో మహీంద్రా డీలర్లు కూడా ఉన్నారు. యాక్సిడెంట్ టైమ్లో ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కాకపోవడంతో డ్రైవ్ చేస్తున్న తన కొడుకు చనిపోయాడని మిశ్రా వెల్లడించారు. యాక్సిడెంట్ కిందటేడాది జరిగింది. మిశ్రా రూ.17.4 లక్షల విలువైన మహీంద్రా స్కార్పియోని తన కొడుకు అపూర్వ్కు 2020 డిసెంబర్లో గిఫ్ట్గా ఇచ్చారు.
కంపెనీ యాడ్స్లో సేఫ్టీ, టెక్ ఫీచర్లు చూసి ఈ కారు కొన్నానని, అంతేకాకుండా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఆనంద్ మహీంద్రా పోస్ట్లు చూసి ఆకర్షితుడినయ్యానని ఎఫ్ఐఆర్లో మిశ్రా పేర్కొన్నారు. స్కార్పియోలో కాన్పూర్ నుంచి లక్నో వస్తున్న అపూర్వ్ 2022, జనవరి 14 న యాక్సిడెంట్లో చనిపోయారు. ఎఫ్ఐఆర్ ప్రకారం, పొగ కమ్ముకోవడంతో కారు డివైడర్ను గుద్దింది. అపూర్వ్, అతని ఇద్దరు ఫ్రెండ్స్ సీటు బెల్ట్ పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. అపూర్వ్ మాత్రం ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కాలేదని, కొన్ని కీలకమైన సేఫ్టీ ఫీచర్లు పనిచేయలేదని, అందుకే తన కొడుకు చనిపోయాడని మిశ్రా ఆరోపిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నాని, మరో 11 మందిపై ఐపీసీ సెక్షన్ 420 (మోసం చేయడం), 280 (మెషినరీని సరిగ్గా పట్టించుకోకపోవడం), 304 ఏ (నిర్లక్ష్యం వలన మృతి), 504 (కావాలని అవమానించడం), 506 (బెదిరింపు), 120–బీ(కుట్ర) కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.