- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సీఎం నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నట్టు ఏఐఎస్ఎఫ్ ప్రకటించింది. గురువారం హిమాయత్ నగర్లోని రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా, పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఆపుతూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

