- ప్రధాని ఉక్కు సంకల్పంతోనే ఇది సాధ్యమైంది: ఆకుల విజయ
హైదరాబాద్, వెలుగు: దశాబ్దాలుగా కేవలం నినాదానికే పరిమితమైన మహిళా రిజర్వేషన్లు, ప్రధాని మోదీ ఉక్కు సంకల్పంతో ఇప్పుడు నిజం కాబోతున్నాయని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. 33 శాతం రిజర్వేషన్ల బిల్లు అమలుతో మోదీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆమె కొనియాడారు. బుధవారం ఆమె ఒక ప్రకటన రిలీజ్ చేశారు. దేశాన్ని పరిపాలించగల సామర్థ్యం మహిళలకు ఉందని ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమదేవి, అహల్యాబాయి హోల్కర్ వంటి వీరనారీమణులు ఎప్పుడో నిరూపించారని గుర్తుచేశారు.
కానీ, గత ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్లను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నాయి తప్పా, మనస్ఫూర్తిగా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అనేది దయాదాక్షిణ్యం కాదని.. అది నారీ శక్తికి నిదర్శనమని తెలిపారు. గతంలో రిజర్వేషన్లు అంటే కేవలం ఒకటి, రెండు రాజకీయ కుటుంబాలకు చెందిన మహిళలకే దక్కేవని, కానీ ఇప్పుడు 33 శాతం రిజర్వేషన్లతో సామాన్య మహిళలు కూడా చట్టసభల్లో అడుగుపెట్టే అద్భుత అవకాశం కలిగిందని చెప్పారు.

