
హైదరాబాద్, వెలుగు: ఆలిండియా బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఫైనల్ చేరుకుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ నితిన్ సాయి యాదవ్ (7/44) ఏడు వికెట్లతో మ్యాజిక్ చేయడంతో చెన్నైలో బుధవారం ముగిసిన సెమీ ఫైనల్లో 90 రన్స్ తేడాతో హర్యానాపై ఘన విజయం సాధించింది.
272 రన్స్ టార్గెట్ ఛేజింగ్లో ఓవర్నైట్ స్కోరు 6/2తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హర్యానా 62.4 ఓవర్లలో 181 స్కోరుకే కుప్పకూలింది. నితిన్ బౌలింగ్లో హర్యానా బ్యాటర్లు విలవిలలాడారు. హిమాన్షు రాణా (46), లక్ష్య దలాల్ (36) మాత్రమే ప్రతిఘటించారు. ఓ దశలో 125 /4తో రేసులో నిలిచిన ఆ జట్టు నితిన్ దెబ్బకు మరో 56 రన్స్కే మిగిలిన వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్లో 91 రన్స్తో జట్టును ఆదుకున్న వరుణ్ గౌడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. శనివారం మొదలయ్యే ఫైనల్లో హైదరాబాద్.. టీఎన్సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్తో తలపడనుంది.