గవర్నర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు

గవర్నర్ ను కలిసిన అఖిలపక్ష నేతలు

పంజాగుట్టలోఅంబేద్కర్ విగ్రహాం కూల్చివేతను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు గవర్నర్ ను కలిశారు. కూల్చిన చోటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో  మందకృష్ణ మాదిగతో పాటు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, బీజేపీ నేత కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నేత మల్లు రవి ఉన్నారు.

జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతిని కలుస్తాం: మందకృష్ణ

పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు మంద కృష్ణ మాదిగ.  గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ‘రాజ్యాంగం రాసింది, ఆర్టికల్ 3 పొందుపరిచింది అంబేద్కర్. రాజ్యాంగంలో అంటరానితనం నిషేధించబడింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం అంటరానితనం అమలు చేస్తోంది. అనుమతిలేని విగ్రహాలు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. పక్కనే ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని వదిలి అంబేద్కర్ విగ్రహం కూల్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం అంటరానితనమే. డ్రైవర్లను అరెస్ట్ చేయడం..ఆదేశించిన వారిని వదిలేయడం అంటరానితనానికి నిదర్శనం. సంఘటనకు కారణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు.? ఈ విషయంలో జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతిని కూడా కలుస్తాం‘ అని అన్నారు .