
గద్వాల టౌన్, వెలుగు : పెద్ద ధన్వాడ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలని అఖిలపక్ష, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ సంతోష్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టవద్దని చెప్పి 12 గ్రామాల రైతులు తొమ్మిది నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారన్నారు. పరిశ్రమ అనుమతి రద్దు చేస్తామని రైతులకు గతంలో హామీ ఇచ్చి.. ఇప్పుడు మళ్లీ అకస్మాత్తుగా ఫ్యాక్టరీ పనులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు.
20 మందికి పైగా బౌన్సర్లు, ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై దాడి చేయించారని ఆరోపించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పర్మిషన్లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో నాయకులు వెంకటరాములు, వెంకటస్వామి, పల్లయ్య వాల్మీకి, మద్దిలేటి, టవర్ మక్బూల్ తదితరులు ఉన్నారు.