పోలింగ్ కు సర్వం సిద్ధం..నిజామాబాద్ జిల్లాలో 729 , కామారెడ్డి జిల్లాలో 239 పోలింగ్ సెంటర్లు 

పోలింగ్ కు సర్వం సిద్ధం..నిజామాబాద్ జిల్లాలో 729 , కామారెడ్డి జిల్లాలో 239 పోలింగ్ సెంటర్లు 
  • అన్ని సెంటర్లలో వెబ్ క్యాస్టింగ్​
  • సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నజర్

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ఉమ్మడి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​జరగనుంది.  నిజామాబాద్​జిల్లాలో 729 పోలింగ్​ సెంటర్లు, కామారెడ్డి జిల్లాలో 239 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.  డిస్ట్రిబ్యుషన్​ సెంటర్లలో మంగళవారం సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన సెంటర్లకు వెళ్లారు. 

నిజామాబాద్​జిల్లాలో..

నిజామాబాద్​కార్పొరేషన్​తోపాటు బోధన్​, ఆర్మూర్​, భీంగల్ మున్సిపాలిటీల్లో నేడు పోలింగ్​జరగనుంది.  714 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారికి కేటాయించిన గుర్తులతో 20 శాతం రిజర్వు కలిపి 5,94,581 బ్యాలెట్ పేపర్స్ ప్రింట్ చేయించారు.  మున్సిపాలిటీల పరిధిలో 4,95,485 మంది ఓటర్లు ఉండగా అందులో 93 మంది సర్వీస్ ఓటర్లు, పోలింగ్ డ్యూటీలు నిర్వహిస్తున్న  4,375 మంది స్టాఫ్ పోస్టల్ బ్యాలెట్స్ పోనూ మిగతా వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి.  

ప్రతి సెంటర్​కు ఐదుగురు చొప్పున..

 ఎలక్షన్​ కమిషన్ ఆదేశాల ప్రకారం ప్రతి 750 నుంచి 770 మంది ఓటర్లకు ఒక పోలింగ్ సెంటర్​ చొప్పున  729 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక పీవో, ఒక ఏపీవో, ముగ్గురు ఓపీవోలను నియమించారు. పోలింగ్​ ప్రక్రియను పరిశీలించేందుకు 66 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 66 అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. జిల్లావ్యాప్తంగా 36 రూట్లలో 47 మంది జోనల్ ఆఫీసర్లు, 73 మంది మైక్రో అబ్జర్వర్లు ఉన్నారు.

అన్ని పోలింగ్ సెంటర్లలో వెబ్​ క్యాస్టింగ్ ఏర్పాటు చేసి దానిని కలెక్టరేట్​లో డిజిటల్​ స్క్రీన్​కు లింక్ చేశారు.  ప్రతి సెంటర్లలో బీఎల్​వోలతో కూడిన హెల్ప్ డెస్క్​ ఓటర్లు అందుబాటులో ఉంటుంది. వారి ద్వారా ఓటర్​ స్లిప్​లను ఇప్పటికే ఓటర్లకు పంపిణీ చేయించారు.  లిస్టులో పేరున్న ఓటర్లు 18 రకాల ఐడీ ప్రూఫ్స్​లో ఒకటి చూపి ఓటు వేయొచ్చు.

పోలింగ్ ముగిశాక సీల్​ బాక్స్​లను నిజామాబాద్​లోని పాలిటెక్నిక్ కాలేజీ, బోధన్​లోని విజయమేరీ స్కూల్​, ఆర్మూర్​లోని గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ, భీంగల్​లోని గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీ లోని స్ట్రాంగ్​ రూమ్స్​కు తరలిస్తారు. ఇందుకోసం 11 రూమ్స్  సిద్దం చేశారు. 13న జరిగే కౌంటింగ్ వరకు స్ట్రాంగ్​ రూమ్స్​ చుట్టూ భారీ సెక్యూరిటీ ఉంటుంది. రాత్రి వెలుతురు కోసం ఫ్లడ్​ లైట్స్​, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. 16న మేయర్​, డిప్యూటీ మేయర్​, చైర్​పర్సన్​, వైస్​చైర్​పర్సన్ ఎన్నుకోనున్నారు. 

భారీ బందోబస్తు

నిజామాబాద్​ నగర పాలక సంస్థ పరిధిలో 49 పోలింగ్ సెంటర్లు హైపర్ సెన్సిటివ్​గా, 88 సెన్సిటివ్​కేంద్రాలు గుర్తించారు. బోధన్​లో 40 హైపర్ సెన్సిటివ్​, 45 సెన్సిటివ్​, ఆర్మూర్​లో 34 హైపర్ సెన్సిటివ్​, 38 సెన్సిటివ్​ సెంటర్లుగా పోలీసులు నోటిఫై చేశారు. భీంగల్​ మున్సిపాలిటీలో 12 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు.

పోలింగ్​ రోజు ఎలాంటి అల్లర్లకు తావులేకుండా ఏడుగురు ఏసీపీలు, 70 మంది సీఐలు, ఎస్సైలు, 1,370 కానిస్టేబుళ్లను నియమించారు. అదనంగా మూడు ప్లాటూన్ల స్పెషల్ పోలీస్​ ఫోర్స్​ను సిద్ధంగా ఉంచారు. ఏదైనా సంఘటన జరిగితే నిమిషాల్లో వచ్చేలా స్ట్రైకింగ్​ ఫోర్స్​, క్విక్ రియాక్షన్​ టీంలను రెడీ చేశారు. 

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో నేడు పోలింగ్ జరగనుంది. 4  డిస్ర్టిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రితో మంగళవారం పోలింగ్ అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్పిపాలిటీల పరిధిలో 92 వార్డులు ఉండగా, పోలింగ్ కేంద్రాలు 239 ఏర్పాటు చేశారు.  

పోలింగ్​ అధికారులు, అసిస్టెంట్​ పోలింగ్​ అధికారులు, సిబ్బంది కలిపి  1,434 మంది ఉన్నారు. 1,49,525 మంది ఓటర్లు ఉండగా, 92 వార్డుల్లో 447 మంది అభ్యర్థులు  పోటీలో ఉన్నారు.  కాంగ్రెస్​ 92, బీఆర్ఎస్​ 92, బీజేపీ 89, ఎంఐఎం 10, సీపీఎం 3,   బీఎస్​పీ 4,  ఆమ్ ఆద్మీ పార్టీ 1,  లోకల్ రికన్నైజుడు పార్టీల నుంచి 18 మంది,  ఇండిపెండెంట్లు 138 మంది బరిలో ఉన్నారు. 

కామారెడ్డి మున్సిపాలిటీ...

 కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులకు గాను 254 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 152 ఉన్నాయి.  99,313 మంది ఓటర్లు ఉండగా,   పురుషులు 50,907 మంది, మహిళలు 48,389 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు.  పోలింగ్ నిర్వహణకు 912 మంది అధికారులు, సిబ్బంది​ ఉన్నారు. 

బాన్సువాడ మున్సిపాలిటీ..

బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డుల్లో 85 మంది అభ్యర్థులు ఉన్నారు.  కాంగ్రెస్​ 19, బీజేపీ 17, బీఆర్​ఎస్​ 19 మంది,  ఎంఐఎం1, ఇండిపెండెంట్లు 29 మంది పోటీ చేస్తున్నారు. 24,188 మంది ఓటర్లు  ఉండగా, మహిళలు 12, 599 , పురుషులు 11,578 మంది, ఇతరులు 11 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 39 ఏర్పాటు చేశారు. పోలింగ్ నిర్వహణకు 234 మందిని వినియోగిస్తున్నారు.  

ఎల్లారెడ్డి మున్సిపాలిటీ..

ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డుల్లో 45 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​  నుంచి 12 మంది చొప్పున, బీఎస్​పీ2, ఇండిపెండెంట్లు ఏడుగురు పోటీలో  ఉన్నారు.  13,265 మంది ఓటర్లు ఉండగా,  పురుషులు 6,321మంది, మహిళలు 6,943 మంది , ఇతరులు ఒకరు ఉన్నారు.  పోలింగ్ కేంద్రాలు 24 ఏర్పాటు చేయగా పోలింగ్ నిర్వహణకు 144 మందిని వినియోగిస్తున్నారు. 

బిచ్​కుంద మున్సిపాలిటీ..

బిచ్​కుంద మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 63 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్ఎస్​లో 12 మంది చొప్పున,  బీఎస్పీ1, ఎంఐఎం 1, లోకల్​ రికగ్నజ్డ్​ పార్టీలు 4, ఇండిపెండెంట్లు 21 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 24 ఏర్పాటు చేయగా, 144 మంది అధికారులు, సిబ్బంది పోలింగ్ నిర్వహణలో పాల్గొంటారు.  

722 మంది పోలీస్​ సిబ్బందితో 5 అంచెల భద్రత..

మున్సిపాలిటీల్లో పోలింగ్​ పక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్​ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. 722 మంది సిబ్బందితో 5 అంచెల్లో భద్రత ఏర్పాట్లు చేశారు. 17 క్రిటికల్, 8 సెన్సిటివ్​, 8 హైపర్​ సెన్సిటివ్ కేంద్రాలను గుర్తించి వీటి వద్ద అదనపు బలగాలు మోహరించాయి. 4 స్పెషల్​ స్ర్టైకింగ్ ఫోర్స్​, 10 స్ట్రైకింగ్ ఫోర్స్​ , 21 రూట్ మొబైల్​,  5 ఎస్​హెచ్​వో పెట్రోలింగ్​, ఎఫ్​ఎస్​టీ, ఎస్​ఎస్​టీ, టీమ్స్​తో బందోబస్తు వినియోగిస్తున్నారు.  పోలింగ్​ కేంద్రాల వద్ద 144 సెక్షన్​ విధించారు.   

పోలింగ్​ నిర్వహణకు ఏర్పాట్లు కంప్లీట్​ఆశిష్​ సంగ్వాన్, కామారెడ్డి కలెక్టర్​  

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు జిల్లాలో ఏర్పాట్లు కంప్లీట్​ అయ్యాయని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.  మంగళవారం ఆయన డిస్ర్టిబ్యూషన్ సెంటర్​ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు. పోలింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు.  పోలింగ్​ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. 

నిర్భయంగా ఓటు వేయాలి రాజేశ్​చంద్ర, ఎస్పీ- కామారెడ్డి 

 నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి.  కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీల్లో పోలింగ్​ను ప్రశాంతంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేశాం.  పోలింగ్​ నిర్వహణ ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి.