హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రమోషన్ టీజర్ ని విడుదల చేశారు. సినిమాకు ‘అల.. వైకుంఠపురములో’ అనే టైటిల్ నిర్ణయించారు. బన్నీ, మురళీ శర్మ మధ్య సాగే సీన్స్ టీజర్ రూపంలో చూపించారు. అల్లు అర్జున్ మధ్య తరగతి యువకుడిలా కనిపించారు. ‘ఏంట్రోయ్.. గ్యాప్ ఇచ్చావు?’ అని మురళీ శర్మ ప్రశ్నిస్తే.. ‘ఇవ్వలా.. వచ్చింది’ అని బన్నీ ఎటకారంగా సమాధానం చెప్పే తీరు ఆకట్టుకుంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ లపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ సినిమాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.